టీమిండియాకు బిగ్ షాక్. చీలమండల గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ టీ20 ప్రపంచకప్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్లో నొప్పిని భరిస్తూనే, ఇంజెక్షన్లు తీసుకుంటూ షమి భారత్ తరఫున గొప్పగా పోరాడిన సంగతి తెలిసిందే. 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అనంతరం గాయం నుంచి కోలుకోవడానికి శ్రమించాడు. ఎన్సీఏలో చికిత్స తీసుకున్నాడు.
అయినప్పటికీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో నిన్న లండన్లో చీలమండ సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని షమి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ''చీలమండ శస్త్రచికిత్స విజయవతంగా జరిగింది. కోలుకోవడానికి సమయం పడుతుంది. తిరిగి మునపటిలా నా పాదాలను పొందడానికి ఎదురుచూస్తున్నా'' అని షమి ట్వీట్ చేశాడు.

అయితే సర్జరీ నుంచి కోలువడానికి షమికీ కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. అయితే జూన్ నుంచి వెస్టిండీస్, అమెరికాలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్కు కూడా షమి అందుబాటులో ఉండడని తెలుస్తోంది. జూన్లోపు షమి పూర్తి ఫిట్నెస్ సాధించడం, తిరిగి లయను అందుకోవడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్లో స్టార్ పేసర్ షమి లేకపోవడం టీమిండియాకు ప్రతికూలమే.
మరోవైపు షమి లేకపోవడంతో ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పటికే మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్ గూటికి చేరాడు. దీంతో జట్టు పగ్గాలు శుభ్మన్ గిల్కు అప్పగించారు. ఇప్పుడు షమి కూడా జట్టులో లేకపోవడం గుజరాత్కు కష్టతరమైన విషయమే. గత సీజన్లో గుజరాత్ను ఫైనల్కు చేర్చడంలో షమి పాత్ర కీలకం. జట్టు తరఫున షమి అత్యధిక వికెట్లు తీశాడు.
కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. ముంబయి ఇండియన్స్తో పోటీపడనుంది.