IPL 2025: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2025కు ముందు ముంబై ఇండియన్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ కు తొలి రెండు వారాల పాటు బుమ్రా దూరం కానున్నాడని సమాచారం. ముంబై ఇండియన్స్ ఆడే తొలి నాలుగైదు మ్యాచ్ లకు జస్ప్రీత్ బుమ్రా మిస్ అవుతాడని తెలుస్తోంది. ఏప్రిల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరే అవకాశం ఉంది.
వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లో కోలుకుంటున్నాడు. బుమ్రా గాయంతోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో బౌలింగ్ చేయగలడని చెప్పడం అసాధ్యం. ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఏప్రిల్ మొదటి వారం ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి రావచ్చని సమాచారం. బుమ్రా ఇంకా పూర్తి బలంతో బౌలింగ్ చేయడం ప్రారంభించలేదని నివేదిక వెల్లడించింది. వైద్య బృందం క్రమంగా బుమ్రాకు పనిభారాన్ని, తీవ్రతను పెంచుతోంది. కొన్ని రోజుల పాటు ఎటువంటి అసౌకర్యం లేకుండా బుమ్రా బౌలింగ్ చేసే వరకు వైద్య బృందం అతడిని పర్యవేక్షించనుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఏప్రిల్లో ఐపీఎల్లో చేరే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం..
ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఐదు టెస్టుల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ లో వీలైనన్ని ఎక్కువ టెస్టులకు బుమ్రాను ఫిట్ గా ఉంచడమే లక్ష్యం. ఇంగ్లాండ్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. కానీ రోహిత్ తర్వాత సెలెక్టర్లు యువ కెప్టెన్ ను ఎంపిక చేయకపోతే జట్టును నడిపించడానికి బుమ్రానే ముందు వరుసలో ఉంటాడు.