మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే
ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్ రూ.4.60 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో మధుశంకకు గాయమైంది. తొడకండరాల సమస్యతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. 6.4 ఓవర్లు బౌలింగ్ వేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

అయితే ఇవాళ స్కానింగ్లో మధుశంకకు తొడకండరాల గాయం తీవ్రత తెలిసింది. దీంతో బంగ్లాదేశ్ పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి బయల్దేరాడు. కొన్నిరోజుల పాటు శ్రీలంకలోనే ఉండి చికిత్స తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్లో పాల్గొనడంపై స్పష్టత లేదు. అతడు ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలూ ఉన్నాయి.
23 ఏళ్ల మధుశంక వన్డే వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్ల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. అందుకే వేలంలో అతడికి భారీ డిమాండ్ వచ్చింది. భారత్లోని పిచ్లపై ఈ ఎడమచేతి వాటం పేసర్ రాణిస్తాడని ముంబై ఇండియన్స్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది.
అయితే ముంబై ఇండియన్స్ మరో విదేశీ ఫాస్ట్ బౌలర్ కొయెట్టీ కూడా ఈ సీజన్లో పాల్గొనడం సందేహాలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా యువ సంచలనం కొయెట్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గజ్జల్లో గాయంతో అతడు ఆటకు దూరమై దాదాపు మూడు నెలలు అయ్యింది. కొయెట్జీ గాయం గురించి ముంబై ఇండియన్స్ వైద్య సిబ్బంది ఆరాతీస్తుంది. కాగా, వన్డే వరల్డ్ కప్లో కొయెట్జీ ఎనిమిది మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరూ విదేశీ ఫాస్ట్ బౌలర్లు ఐపీఎల్కు దూరమైతే ముంబైకు తీవ్ర ప్రతికూలాంశంగా మారుతుంది.