న్యూఢిల్లీ: పాత్రికేయుడి పట్ల అవమానకరంగా ప్రవర్తించిన విరాట్ కోహ్లీ భారత మాజీ స్టార్లు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ల నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐసీసీ ప్రపంచకప్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ కామెంటేటర్ రమీజ్ రాజా... కోహ్లీని ఉద్దేశించి, నీవు అభిమానులకు మరో సచిన్ టెండుల్కర్ అని వ్యాఖ్యానించాడు. కోహ్లీ బ్యాటింగ్ దూకుడు చూస్తే మరో సచిన్ అనే విషయంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. అయితే వ్యక్తిత్వం విషయంలో మాత్రం సచిన్, రాహుల్, లక్ష్మణ్ల వంటి వారి నుండి అతను ఎంతో నేర్చుకోవాలని అంటున్నారు.
క్రికెట్లో సచిన్ స్థాయిలో ఇకముందు ఎంత వరకు రాణిస్తారో లేదో తెలియనప్పటికీ... వ్యక్తిత్వం విషయంలో అతనిని కచ్చితంగా అనుసరించాల్సి ఉందని చెబుతున్నారు. ఆన్ ఫీల్డ్ లేదా ఆఫ్ పీల్డులో సీనియర్లను ఫాలో కావాలని చెబుతున్నారు. విరాట్ కోహ్లీ ఆన్ ఫీల్డ్ లేదా ఆఫ్ ఫీల్డ్లో దూకుడుగా ఉంటాడు. ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్కు మారుపేరు. వారికి కూడా కోహ్లీ ధీటుగా స్పందిస్తుంటాడు.

ఆ విషయం పక్కన పెడితే.. ప్రియురాలి విషయంలో, ఆమె పైన ఆర్టికల్ రాశారని ఓ పాత్రికేయుడి పైన కోహ్లీ మండిపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వార్తలు రాసినందుకు అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని అంటున్నారు. అంతేకాకుండా, అసలు అది రాసిన వారిని కాకుండా అతను మరొకరిని తిట్టిపోశాడు. అనంతరం అతనికి క్షమాపణలు కూడా చెప్పాడు.
విరాట్ కోహ్లీ ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని చెప్పవచ్చు. గతంలో వైస్ కెప్టెన్గా వన్డేల్లో తన కోపం ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి.
ఐపీఎల్ సమయంలో గౌతమ్ గంభీర్తో గొడవ పడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డ్లో వారితో వాదానికి దిగాడు. సిడ్నీ జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ వేలు చూపించాడు. అంతేకాదు.. డ్రెస్సింగ్ రూంలో శిఖర్ ధావన్తో వాగ్వాదానికి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే కోహ్లీ సీనియర్ల నుండి నేర్చుకోవాల్సి ఎంతో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. రికార్డులు బద్దలు కొట్టడమే కాదని, వ్యక్తిత్వం ముఖ్యమని చెబుతున్నారు.
సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్ వంటి వారి నుండే కాకుండా... జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీని చూసి కూడా చాలా నేర్చుకోవచ్చునని చెబుతున్నారు. ఎనిమిదేళ్లుగా సారథ్యం వహిస్తున్న ధోనీకి కోపం వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కోహ్లీ - ధావన్ల గొడవ పైన ధోనీ సెటైర్ వేస్తేనే చర్చనీయాంశమైంది.