చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. వరుస పరాజయాల అనంతరం గొప్పగా పుంజుకుని తిరిగి గెలుపు బాట పట్టింది. సొంతమైదానంలో చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పది పాయింట్లతో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7x4, 1x6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1x4, 4x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ రెండు బంతులు ఎదుర్కొని అజేయంగా అయిదు పరుగులు చేశాడు.

అనంతరం ఛేదనలో సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (32; 26 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే (4/27) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ (2/19), పతిరనా (2/17) చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్ను వీక్షించడానికి నేరుగా స్టేడియానికి వచ్చిన ధోనీ భార్య సాక్షి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో సాక్షి తన ఇన్స్టాగ్రామ్లో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను అత్త కాబోతున్నట్లు శుభవార్తను చెప్పారు. అంతేగాక మ్యాచ్ను త్వరగా ముగించాలని రిక్వెస్ట్ చేశారు. వికెట్ కీపింగ్ చేస్తున్న ధోనీ ఫొటోతో.. 'ప్లీజ్ ఇవాళ మ్యాచ్ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా ఇదే నా అభ్యర్థన' అంటూ సాక్షి తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు.
తాను అత్త కాబోతున్నట్లు సాక్షి ఇలా ప్రపంచానికి భిన్నంగా తెలియజేశారు. దీంతో మామ కాబోతున్న ధోనీకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాకు ధోనీగా దూరంగా ఉన్నప్పటికీ, సాక్షి మాత్రం ఆసక్తికర పోస్టులతో ధోనీ అభిమానులను అలరిస్తుంటారు.