స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. బాబర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే.. దాదాపు రెండేళ్లుగా స్వదేశంలో విజయానికి దూరమైన పాకిస్థాన్ తిరిగి గెలుపు బాట పట్టాలని సంచలన నిర్ణయాలు తీసుకుంది. తమ ప్రధాన బ్యాటర్ బాబర్ అజామ్ను జట్టు నుంచి తప్పించింది. ఇంగ్లండ్తో రెండు, మూడు టెస్టులకు అతన్ని ఎంపిక చేయలేదు.
అయితే బాబర్ అజామ్ను జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని క్రికెటర్లు, మాజీలు వ్యతిరేకించారు. మరోవైపు పాక్ బోర్డు మాత్రం అతన్ని తప్పించలేదని, విశ్రాంతి ఇచ్చామని చెప్పింది. సెలక్షన్ కమిటీలోని ఆకీబ్ జావేద్.. విశ్రాంతి ఇచ్చామని పేర్కొంటూ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని కూడా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపాడు. దీంతో బాబర్ అజామ్ వేటుపై గందరగోళం ఏర్పడింది.

మరోవైపు బాబర్ అజామ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ సెంచరీతో కదం తొక్కాడు. అరంగేట్ర మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరులో ఆకట్టుకున్నాడు. 19 పరుగులకే రెండు వికెట్ల కోల్పోయి జట్టు కష్టాల్లో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన కమ్రాన్ శతకం సాధించాడు. 224 బంతుల్లో 118 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.
అయితే తనని తప్పించడంపై చర్చ జరుగుతున్నప్పటికీ వివరణ ఇవ్వని బాబర్ అజామ్.. కమ్రాన్ గులామ్ సెంచరీపై స్పందించాడు. 'కమ్రాన్.. బాగా ఆడావు' ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. ఇది నెట్టింట వైరల్గా మారింది. కాగా, 2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్పై కూడా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. టీ20, వన్డే కెప్టెన్సీకి బాబర్ ఇటీవల గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.