వరుస వైఫల్యాలతో విమర్శలు పాలవుతున్న పాకిస్థాన్ జట్టును ప్రక్షాళన చేయడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధమైంది. ఈ క్రమంలో బాబర్ అజామ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నారని సమాచారం. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అజామ్ అన్ని ఫార్మాట్లకు సారథి బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
అయితే టీ20 వరల్డ్ కప్ ముంగిట అజామ్కు తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో జట్టు పగ్గాలు అందించారు. కానీ అజామ్ కెప్టెన్సీలో పాక్ మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది. అమెరికా చేతిలో ఓటమిపాలై తీవ్ర విమర్శలపాలైంది. కాగా, ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలోనూ టెస్టు సిరీస్ ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది.

టెస్టు ఫార్మాట్కు బాబర్ అజామ్ కెప్టెన్సీ చేయకపోయినా.. అతని పేలవ ఫామ్, జట్టులో గొడవలు కారణాలతో టీ20, వన్డేలకు కొత్త కెప్టెన్ను తీసుకురావాలని పీసీబీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని లక్ష్యంగా జట్టును నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్కు జట్టు పగ్గాలు అందివ్వాలని పీసీబీ భావిస్తుందని తెలుస్తోంది.

జట్టులో గొడవలకు కారణమేంటి?
వన్డే వరల్డ్ కప్ తర్వాత టీ20లకు బాబర్ అజామ్ స్థానంలో షాహిన్ అఫ్రిదిని కెప్టెన్గా నియమించారు. కానీ అఫ్రిదికి కేవలం న్యూజిలాండ్ సిరీస్ వరకే ఛాన్స్ ఇచ్చారు. తిరిగి బాబర్ను సారథిగా ఎంపిక చేశారు. అనంతరం జట్టులో గొడవలు మొదలయ్యాయి. కెప్టెన్సీ మార్పులతో జట్టులో ఐక్యత దెబ్బతిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, నవంబర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనతో పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.