
సౌతాంప్టన్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజు రాత్రి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా సహచరులు, మిత్రులు, శ్రేయాభిలాషుల నుంచి అభినందనలు, ఉద్వేగపూరిత సందేశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ధోనీ రిటైర్మెంట్పై పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు. గొప్ప కెరీర్ సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పాడు.
ఇంగ్లండ్తో రెండో టెస్టు ముగిశాక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ట్విటర్లో స్పందించి ఎంఎస్ ధోనీ సేవలను కొనియాడాడు. 'గొప్ప కెరీర్ సొంతం చేసుకున్నందుకు కంగ్రాట్స్ ధోనీభాయ్. మీ నాయకత్వం, పోరాట పటిమ మరియు వారసత్వంను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ భవిష్యత్ మరింత బాగుండాలని కోరుకుంటున్నా' అని అజామ్ ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో అజామ్ ఇప్పటివరకు 28 టెస్టుల్లో, 74 వన్డేల్లో, 38 టీ20 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా స్పదించాడు. 'ధోనీ భారత్లోనే గొప్ప కాదు ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక్కడే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. ఇక 2005లో పాకిస్థాన్ భారత పర్యటన సందర్భంగానే ధోనీ వెలుగులోకి వచ్చాడు. ఆ సమయంలో నేను పాకిస్థాన్కు కెప్టెన్గా ఉన్నా. నా కళ్లముందే మహీ అరంగేట్రం చేసినా.. అతడు ఆడే విధానం, బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే ధోనీ ఎంతో అనుభవమున్న ఆటగాడిలా ఆడాడు. ధోనీ సారథ్యంలోనే భారత్ విజయాల నిష్పత్తి మెరుగైంది. అంతకుముందు భారత్ కేవలం ఉపఖండంలోనే రాణించేది, ధోనీ పగ్గాలందుకున్నాక విదేశాల్లో సైతం మంచి ఫలితాలు రాబట్టింది' అని ఇంజమామ్ అన్నారు.
అంతర్జాతీయ కెరీర్లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్లలో 1,600 పరుగుల బాదాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత 10,733 పరుగులు సాధించిన ఆటగాడిగా ఎంఎస్ ధోనీ వన్డేల్లో భారత ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ మహీ మాత్రమే.
MS Dhoni: ఫినిషింగ్ సిక్స్ పడిన చోటే.. వాంఖడేలో ధోనీకి శాశ్వత సీటు!!
https://telugu.mykhel.com/cricket/ms-dhoni-may-get-a-permanent-seat-at-iconic-wankhede-stadium-where-his-2011-world-cup-six-landed/articlecontent-pf49182-029775.html