పాకిస్థాన్తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (137; 62 బంతుల్లో) మెరపు శతకం బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 224 పరుగులు చేసింది. కివీస్ తరపున టీ20ల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో స్టీఫెర్ట్ (31; 23 బంతుల్లో)ది రెండో అత్యధిక స్కోరు. స్టీఫెర్ట్తో కలిసి రెండో వికెట్కు ఫిన్ అలెన్ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే పాకిస్థాన్ ప్రధాన బౌలర్లు హరీష్ రవూఫ్, షాహిన్ అఫ్రిది దారుణంగా విఫలమయ్యారు. హారిష్ 60 పరుగులు, షాహిన్ అఫ్రిది 43 పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారీ ఛేదనలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. ఓపెనర్ సయిమ్ అయుబ్ (10; 13 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. మహ్మద్ రిజ్వాన్ (24; 20 బంతుల్లో)తో కలిసి బాబర్ అజామ్ (58; 37 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాబర్ వరుసగా మూడో అర్ధశతకం సాధించాడు.
అయితే బాబర్ అజామ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20 సిరీస్లో ఓటమిపాలైన జట్టులో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన తొలి ఆసియా క్రికెటర్గా బాబర్ రికార్డులకెక్కాడు. ప్రతి ప్లేయర్ జట్టు విజయంలో భాగమవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బాబర్ పోరాడినప్పటికీ దురదృష్టవశాత్తు కోరుకోని రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ అజామ్పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇది దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రికార్డు అని, ఇలాంటి రికార్డులు ఎవరూ ఆశించరని కామెంట్లు చేస్తున్నారు.
న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో బాబర్ 35 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో 46 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రెండో టీ20లో బాబర్ 43 బంతుల్లో 66 పరుగులు చేయగా, పాక్ 21 పరుగుల తేడాతో ఓడింది. ఇవాళ జరిగిన మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. కాగా, జనవరి 19న, జనవరి 21న చివరి రెండు టీ20లు జరగనున్నాయి.