
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనను పోల్చడం ఎంతమాత్రం సరికాదని పాకిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ బాబర్ అజమ్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ బ్యాట్స్మన్ అని, అలాంటి కోహ్లీతో పోల్చడం గర్వకారణమే అయినా, అతను సాధించిన ఘనతల్ని తాను సాధించలేదనే వాస్తవం గ్రహించాలని అన్నాడు.
'కోహ్లీ లాంటి పెద్ద ఆటగాడితో నన్ను పోల్చుతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఇది కేవలం కోచ్ ఆలోచన మాత్రమే. కేరీర్ ప్రారంభంలో గణాంకాలు ఒకేలా ఉన్నప్పటికీ, కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. పాకిస్థాన్ జట్టు తరుపున నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకుంటున్నా' అని అజమ్ తెలిపాడు.
'ప్రస్తుతం నేను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను ఫాలో అవుతున్నా. గతంలో ఏబీ డివిలియర్స్ను ఎక్కువగా అనుసరించే వాణ్ని. ఎంతలా అంటే అతను ఆడే షాట్లను ప్రత్యేకంగా సాధన చేసేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే ఏబీని కాపీ కొట్టేవాడిని. ప్రధానంగా నెట్స్లో కనీసం కొన్ని షాట్లైనా ఏబీ మ్యాచ్ల్లో కొట్టిన షాట్లను ప్రాక్టీస్ చేసేవాడిని' అని పేర్కొన్నాడు.
'కాకపోతే ఇప్పుడు నేను ఫాలో అయ్యే క్రికెటర్లలో కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలిని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటా. కోహ్లీ, ఆమ్లా, ఏబీ డివిలియర్స్ల బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. దాంతోనే వారిపై విపరీతమైన అభిమానం ఏర్పడింది' అని బాబర్ అజమ్ తెలిపాడు.
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్తో జరిగిన ఫైనల్లో బాబర్ అజమ్ 52 బంతుల్లో 42 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాకిస్థాన్ తరుపున ఇప్పటివరకు 36 వన్డేలాడిన బాబర్ అజమ్ 58.60 యావరేజితో 1758 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.