టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్ కథ ముగిసింది. గత మెగాటోర్నీలో రన్నరప్గా నిలిచిన పాకిస్థాన్ ఈసారి సూపర్-8 స్టేజ్కు కూడా అర్హత సాధించలేకపోయింది. అమెరికాను తక్కువగా అంచనా వేసి కంగుతిని, ఎప్పటిలానే భారత్ చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మెగాసమరంలో పాక్కు ఓదార్పు విజయం దక్కింది.
ఆదివారం ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (31; 19 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాహిన్ అఫ్రిది (3/22) మూడు వికెట్లతో సత్తాచాటాడు. మహ్మద్ అమీర్ (2/11) రెండు వికెట్లు తీశాడు.

అనంతర ఛేదనలో పాకిస్థాన్ 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. అయితే పాకిస్థాన్ ఛేజింగ్ ఆసక్తికంగా సాగింది. ఓ దశలో పాక్ 52/2తో మెరుగైన స్థితిలో ఉన్న పాక్ అనూహ్యంగా 62/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ అబ్బాస్ అఫ్రిది (17; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), షాహిన్ అఫ్రిది (13 నాటౌట్; 5 బంతుల్లో, 2 సిక్సర్లు)తో కలిసి కెప్టెన్ బాబర్ అజామ్ (32 నాటౌట్, 34 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ క్రమంలో బాబార్ అజామ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్గా బాబర్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. బాబర్ అజామ్ 17 ఇన్నింగ్స్ల్లో 549 పరుగులు సాధించాడు.
ధోనీ 29 ఇన్నింగ్స్ల్లో 529 పరుగులు చేశాడు. పొట్టి కప్లో పరుగుల వరద పారించిన కెప్టెన్ల జాబితాలో బాబార్, ధోనీ తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, మహేలా జయవర్ధనె, గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. విలియమ్సన్ 19 ఇన్నింగ్స్ల్లో 527 పరుగులు, జయవర్ధనె 11 ఇన్నింగ్స్ల్లో 360, స్మిత్ 16 ఇన్నింగ్స్ల్లో 352 పరుగులు చేశారు.