హైదరాబాద్: పాకిస్థాన్ జట్టుకు చెందన బాబర్ అజమ్ అరుదైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా అడిలైడ్లో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
1981లో పాకిస్థాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 35 ఏళ్లకు అజమ్ ఐదు వన్డేల సిరిస్లో భాగంగా అడిలైడ్లో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వార్నర్ 128 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు సాధించి తన కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్కి ఇది 13వ సెంచరీ.

మరో ఓపెనర్ ట్రావిడ్ హెడ్ 137 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 128 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 284 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియా జట్టుకు ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. పాకిస్థాన్పై 2012లో మీర్పూర్లో 183 పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ తర్వాత వార్నరే (179) ఆ జట్టుపై ఎక్కువ స్కోరు చేశాడు.
అనంతరం ఆస్ట్రేలియా నిర్దేశించిన 370 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49.1 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో బాబర్ అజమ్ సెంచరీ చేయగా, షర్జిల్ ఖాన్(79) అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఐదు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా 4-1తో కైవసం చేసుకుంది.