
ఆసియాకప్ - 2022 ఎడిషన్ కోసం టీమిండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఈ మేరకు భారత ఆటగాళ్లు తమ సన్నాహాలను ప్రారంభించే వీడియోను అప్లోడ్ చేసింది. ఇక ఈ వీడియోలో అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ స్టార్ క్రికెటర్లు కూడా కన్పించారు. యుజ్వేంద్ర చాహల్, అఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. భారత స్టార్ విరాట్ కోహ్లీ అలాగే ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆకట్టుకుంది. విరాట్ పట్ల బాబర్ ఆజామ్ ఎప్పుడూ ఆదరాభిమానాలను ప్రదర్శిస్తుంటాడనే సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ పేలవ ఫామ్తో సతమతమవుతుండడంతో కోహ్లీని ఉద్దేశించి బాబర్ ఆజామ్ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనమైంది. ఈ సమయం గడిచిపోతుంది. స్టే స్ట్రాంగ్ అంటూ ఆజామ్ కోహ్లీకి సపోర్ట్ చేశాడు. ఇరువురు చిరకాల ప్రత్యర్థి దేశాలకు ఆడుతున్నప్పటికీ వీరి మధ్య మాత్రం మంచి సంబంధాలే ఉన్నాయి. గతేడాది దుబాయ్లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ తర్వాత కోహ్లీ, బాబర్ కలిసి పరస్పరం నవ్వుతూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఆటను ఆటగానే చూడాలనే సందేశాన్ని, స్పోర్టివ్ నెస్ను ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లు అయిన వీరిద్దరు చూపుతూనే ఉంటారు. ఇక గతేడాది ప్రపంచకప్లో భారత్పై పాకిస్థాన్ తొలిసారి గెలిచింది. ఆ గేమ్లో బాబర్, విరాట్ ఇద్దరూ హాఫ్సెంచరీలు సాధించారు. అయితే ఆ మ్యాచ్ భారత్కు 10వికెట్ల భారీ ఓటమిని మాత్రమే మిగిల్చింది.
ప్రస్తుతం కోహ్లీ పేలవ ఫాంలో ఉన్నప్పటికీ బాబర్ మాత్రం తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనలో కూడా బాబర్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు భారత్ ఇంగ్లండ్ పర్యటన తర్వాత విరాట్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతను వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్లలో పాల్గొనలేదు. ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్తో మళ్లీ కోహ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టబోతున్నాడు.