మరో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. గత వన్డే ప్రపంచకప్లో జరిగిన పరాభవం పొట్టి కప్లో పునరావృతం కాకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. బాబర్ అజామ్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అందించింది. వైట్ బాల్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా గ్యారీ కిర్స్టన్ను నియమించింది.
అంతేగాక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చింది. టీ20 వరల్డ్ కప్ను ముద్దాడాలని ఇలా సంచలన నిర్ణయాలు తీసుకుంది. అయితే వారి నిర్ణయాలే వాళ్ల కొంపముంచుతునున్నాయి. బాబర్కు తిరిగి కెప్టెన్సీ ఇవ్వడం, ఇమాద్-అమీర్ తిరిగి రావడంతో పాక్ జట్టులో గ్రూప్లు ఏర్పడ్డాయి.

వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో టీ20లకు షాహిన్ అఫ్రిదిని నియమించారు. కానీ అఫ్రిది జట్టు పగ్గాలు అందుకున్న కొన్ని నెలలకే తిరిగి బాబర్కు బాధ్యతలు అందించారు. ఈ నిర్ణయం జట్టులో కొంత మందికి నచ్చలేదు. మరోవైపు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని తిరిగొచ్చిన ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్లకు బాబర్ వైఖరి మొదటి నుంచి నచ్చదు.
గతంలో పలు ఇంటర్వ్యూలో బాబర్పై వారిద్దరు ఘాటు విమర్శలు చేశారు. తాజాగా పాక్ జట్టులో వారిద్దరు చోటు సంపాదించి బాబర్ సారథ్యంలోనే ఆడుతున్నారు. అయితే బాబర్తో తనకెలాంటి ఇబ్బంది లేదని ఇమాద్ వసీమ్ ఇటీవల మీడియాకు వెల్లడించాడు. జట్టుకు బాబర్ కెప్టెన్ అని, అతనికి పూర్తి మద్దతు ఇస్తామని అన్నాడు.
కానీ ఐర్లాండ్ సిరీస్ కోసం సిద్ధమవుతున్న పాకిస్థాన్ ప్రాక్టీస్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. సాధనలో బాబర్ అజామ్తో ఇమాద్ వసీమ్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఒకరినొకరు తిట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. గొడవను ఆపేయాలని సహచరులు ఎంత నచ్చజెప్పినా ఇమాద్ వినలేదు. అయితే ఇదంతా వీడియో తీస్తున్నారని మరొకరు చెప్పడంతో శాంతించారు. ఐక్యంగా లేని ఈ పాక్ జట్టు టీ20 వరల్డ్ కప్లో ఎలా సమష్టిగా ఆడుతుందనేది అసలు ప్రశ్న.