
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి పాకిస్తాన్పై అఫ్ఘానిస్తాన్ ఒక సిరీస్ నెగ్గింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్లో సీనియర్లు లేని పాకిస్తాన్ను అఫ్ఘాన్ చిత్తుచేసింది. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన పోరాటం కనబరిచిన అఫ్ఘాన్ టీం చరిత్ర సృష్టించింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ అద్భుతంగా పోరాడి తమ జట్టుకు విజయం అందించాడు.
రెండో మ్యాచులో కూడా రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ చివరకు విజయం మాత్రం అఫ్ఘానిస్తాన్నే వరించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 132 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో కొంత చెమటోడ్చిన అఫ్ఘాన్ బ్యాటర్లు చివరకు మరో రెండు బంతులు మిగిలుండగా విజయం సాధించారు. దీంతో తొలిసారి పాకిస్తాన్పై అఫ్ఘాన్ ఒక సిరీస్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి అఫ్ఘాన్ కెప్టెన్గా రషీద్ ఖాన్ కూడా రికార్డు సృష్టించాడు.
ఇక మూడో మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ చెలరేగింది. ఈ మ్యాచ్లో కూడా ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 182 పరుగుల భారీ స్కోరు చేసింది. సైమ్ అయూబ్ (49), కెప్టెన్ షాదాబ్ ఖాన్ (28) రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్ఘాన్ జట్టు విఫలమైంది. ప్రధాన బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయం కేవలం పాక్ పరువు నిలబెట్టేందుకే ఉపయోగపడింది.
ఈ సిరీస్ ఓటమి గురించి మాట్లాడిన పాక్ సారధి షాదాబ్ ఖాన్.. దీని వల్ల ప్రేక్షకులకు సీనియర్ల విలువ తెలుస్తుందని చెప్పాడు. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ వంటి ఆటగాళ్లు లేకపోవడం వల్లనే ఇలా ఓడిపోయామని అన్నాడు. ఈ పరాజయంతో వాళ్లిద్దరికీ ప్రజలు, మీడియాలో గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. 'యువకులకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం అనుకున్నాం. పీఎస్ఎల్లో మంచి ఇన్నింగ్సులు ఆడిన వారికి అవకాశం ఇచ్చాం. కానీ అనుభవం కూడా చాలా ముఖ్యం కదా' అని పేర్కొన్నాడు.