
మెల్బోర్న్: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. ప్రత్యేకించి పేస్ బౌలర్లు తమ తఢాఖా చూపారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ చెలరేగారు. అటు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో పాకిస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఇన్నింగ్ తడబడింది. ప్రారంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఇన్నింగ్ తొలి బంతికే కేప్టెన్ బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యాడు. అర్ష్దీప్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో డాషింగ్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సైతం భారీ స్కోర్ చేయడంలో విఫలం అయ్యాడు. 12 బంతుల్లో అతను చేసిన పరుగులు నాలుగే. మిడిలార్డర్ బ్యాటర్లు షాదబ్ ఖాన్-5, హైదర్ అలీ-2, మహ్మద్ నవాజ్-9, ఆసిఫ్ అలీ-2, షహీన్ షా అఫ్రిది- 16 పరుగులు చేశారు.
టాప్ ఆర్డర్ బ్యాటర్లు షాన్ మసూద్- 52, ఇఫ్తికర్ అహ్మద్-51 పరుగులు చేయకపోయి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారై ఉండేది. టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులను సంధించారు. లైన్ అండ్ లెంగ్త్ విసిరిన బంతులకు పాకిస్తాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేదు. పాకిస్తాన్ బ్యాటర్లకు ఊపిరి సలపని రేంజ్లో ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ మూడు చొప్పున వికెట్లను పడగొట్టారు.
ఈ మ్యాచ్లో బాబర్ ఆజమ్ గోల్డెన్ డకౌట్ కావడం, మహ్మద్ రిజ్వాన్ 12 బంతుల్లో నాలుగు పరుగులే చేయడంపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ రెండు దేశాల ఫ్యాన్స్- పెద్ద ఎత్తున ఏకిపారేస్తోన్నారీ ఇద్దరినీ. రిజ్వాన్ ఇన్నింగ్ టెస్ట్ మ్యాచ్ను తలపించిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. టీ20ల్లో టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్ను అరుదుగా చూస్తోంటామని, అలాంటి దాన్ని రిజ్వాన్ సక్సెస్ఫుల్గా రికార్డ్ చేశాడంటూ ట్రోల్స్ చేశారు.