
మౌంట్ మాంగనీ: ఇంగ్లండ్తో జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ ఓటమికి న్యూజిలాండ్ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్లో చెలరేగిన కివీస్.. అనంతరం బౌలింగ్లోనూ రెచ్చిపోయి ఇంగ్లండ్ను ఓడించింది. వాట్లింగ్ (473 బంతుల్లో 205; 24 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ డబుల్ సెంచరీకి.. శాంట్నర్ (269 బంతుల్లో 126; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకం చేసాడు.
55/3 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ 197 పరుగులకే ఆలౌట్ అయింది. అటు పేస్ ఇటు స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్.. వరుసగా వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బర్న్స్ (31), జో డెన్లీ (35), బెన్ స్టోక్స్ (28), సామ్ కర్రాన్ (29), జోఫ్రా ఆర్చర్ (30)లు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో పేసర్ నీల్ వాగ్నర్ ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. చివరి ఏడు వికెట్లలో ఐదు వికెట్లను వాగ్నర్ సాధించాడు. ఆఫ్ స్పిన్నర్ సాన్ట్నర్ మూడు వికెట్లు సాధించాడు.
ఓవర్ నైట్ స్కోరు 394/6తో శనివారం ఆట కొనసాగించిన కివీస్ 615/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్పై న్యూజిలాండ్కు ఇదే అత్యధిక స్కోరు. రెండు రోజులకు పైగా క్రీజులో నిలిచిన వాట్లింగ్ టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేసుకున్నాడు. అతడికి శాంట్నర్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు రికార్డు స్థాయిలో 261 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విజయంతో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది.
వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ కౌంట్ నిబంధనతో టైటిల్ను అందుకునే అవకాశాన్ని న్యూజిలాండ్ తృటిలో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో భాగంగా 'చివరిదైన' సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో టైటిల్ను సూపర్ ఓవర్లో చేజార్చుకుంది. ఈ రెండు ఓటముల ప్రతీకారంను కివీస్ ఇప్పుడు తీర్చుకుంది.