Mohammad Kaif:ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇబ్రహీం జద్రాన్ స్టార్ ఆఫ్ ది షోగా నిలిచాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ జద్రాన్ 177 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా కీలక పాత్ర పోషించాడు. జద్రాన్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒమర్జాయ్ కేవలం 31 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఒమర్జాయ్ ఐదు వికెట్లను పడగొట్టి ఇంగ్లాండ్ కు ఓటమిని రుచి చూపించాడు. కీలకమైన చివరి ఓవర్ కూడా ఒమర్జాయ్ వేశాడు. ఇలా డూ ఆర్ డై మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. జద్రాన్ అద్భుతమైన ఆటతీరుతో రాణించినప్పటికీ ఒమర్జాయ్ నిజమైన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని అన్నాడు. జద్రాన్ బ్యాట్ తో చేసిన మెరుపుల కంటే.. ఒమర్జాయ్ పరుగులు, తన బౌలింగ్ లో తీసిన ఐదు వికెట్లు ముఖ్యమైనవని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఒమర్జాయ్ ఆల్ రౌండ్ సహకారాలు అందించాడని చెప్పుకొచ్చాడు. "నా అభిప్రాయం ప్రకారం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అజ్మతుల్లా ఒమర్జాయ్. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా లేని పిచ్ లో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ దాదాపు ఆట గెలిచే సమయంలో ఒమర్జాయ్ తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఒమర్జాయ్ కూడా జట్టు కోసం స్కోరు చేశాడు. జద్రాన్ చేసిన పరుగుల కంటే ఒమర్జాయ్ తీసిన వికెట్లు చాలా కీలకమైనవి." అని మ్యాచ్ జరిగిన తర్వాత ఓ షోలో మహ్మద్ కైఫ్ అన్నాడు.

కైఫ్ తో ఏకీభవించిన వహాబ్ రియాజ్
మ్యాచ్ తర్వాత షో ప్యానెల్ లో భాగమైన వహాబ్ రియాజ్.. మహ్మద్ కైఫ్ ప్రకటనతో ఏకీభవించాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కు వెన్నెముకగా నిలిచిన జో రూట్, జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వంటి కీలక వికెట్లను ఒమర్జాయ్ తీసుకున్నాడని.. ఆ తర్వాత చివరి ఓవర్ లో ఆదిల్ రషీద్ ను ఔట్ చేసి మ్యాచ్ ను గెలిపించాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వహాబ్ రియాజ్ అన్నాడు. లాహోర్ స్టేడియం పేసర్లకు అంత అనుకూలంగా ఉండదని.. ఒమర్జాయ్ చేసింది అసాధారణమైనదని రియాజ్ స్పష్టం చేశాడు.