పిచ్ మధ్యలో ముచ్చట్లు పెట్టే క్రమంలో
క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్మన్ క్రీజ్లోకి చేరుకోలేకపోతే రనౌట్గా నిష్క్రమిస్తూ ఉంటారు. అయితే స్టైకర్-నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా రిలాక్స్ అయిపోయి పిచ్ మధ్యలో ముచ్చట్లు పెట్టే క్రమంలో రనౌట్ కావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ తరహా రనౌట్ తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య రెండో టెస్టు అబుదాబిలో జరుగుతోంది. గురువారం మూడో రోజు ఆటలో అజహర్ అలీ(64) విచిత్రంగా రనౌట్ అయ్యాడు.
|
బౌండరీని తాకిందని భ్రమపడిన అజహర్
ఆస్ట్రేలియాతో అబుదాబి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో బంతి బౌండరీ లైన్ను తాకిందని భ్రమపడిన అజహర్ అలీ (64: 141 బంతుల్లో 4ఫోర్లు) పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఆసీస్ పేసర్ సిడెల్ వేసిన 53 ఓవర్ మూడో బంతిని అజహర్ అలీ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ కొట్టాడు. అయితే.. వేగంగా వెళ్లిన బంతి.. బౌండరీ లైన్కి సమీపంలోనే ఆగిపోయింది.ఇది ఫోర్గా భావించిన అజహర్ అలీ-అసద్ షఫిక్లు పిచ్ మధ్యలో ఆగిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు.
వికెట్ కీపర్ టిమ్ పైనీకి అందించగా..
దీంతో.. అప్పటికే బంతి వెంట పరుగెత్తుకుంటూ వెళ్లిన ఫీల్డర్ మిచెల్ స్టార్క్ వేగంగా దాన్ని అందుకుని వికెట్ కీపర్ టిమ్ పైనీకి అందించగా.. అతను వికెట్లను గీరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఏం జరిగిందో..? తొలుత అర్థంకానట్లు తెల్లమొహం వేసిన అజహర్ అలీ.. ఆ తర్వాత థర్డ్ అంపైర్ ఔటని ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
అసద్తో పిచ్ మధ్యలోనే ముచ్చట్లు
నాన్స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగు కోసం వచ్చిన అసద్తో పిచ్ మధ్యలోనే ముచ్చట్లు పెట్టాడు. ఇది నిబంధనల ప్రకారం ఔట్ కావడంతో అజహర్ అలీ భారంగా పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. మరొకవైపు చిన్నపిల్లాడిలా రనౌట్గా పెవిలియన్ చేరడం స్టేడియంలోని అభిమానులకు నవ్వులు తెప్పించింది.