U19 Asia Cup 2025: అండర్-19 ఆసియా కప్ 2025 విజేతగా పాకిస్థాన్ అవతరించింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో టీమిండియాను 191 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ చిత్తు చేసింది. అయితే ఈ ఓటమికి భారత బ్యాటర్ల వైఫల్యం ఒక కారణమైతే.. అంతకంటే ముందు కెప్టెన్ ఆయుష్ మాత్రే తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టాస్ గెలిచి.. కొంపముంచిన ఆయుష్
సాధారణంగా ఫైనల్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్లలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు బోర్డుపై ఉంచాలని భావిస్తుంది. తద్వారా ప్రత్యర్థిపై మానసిక ఒత్తిడి పెంచవచ్చు. కానీ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే దీనికి భిన్నంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ఆయుష్ మాత్రే నిర్ణయాన్ని తప్పు అని నిరూపిస్తూ 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఆ భారీ స్కోరు భారత్ను మానసిక ఒత్తిడిలోకి నెట్టింది. పాక్ కెప్టెన్ కూడా టాస్ సమయంలో తాము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నామని చెప్పడం.. ఆయుష్ వ్యూహం ఎంత తప్పో స్పష్టం చేసింది.

తాటాకు కోటలా కూలిన బ్యాటింగ్ లైనప్
348 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఏమాత్రం పోరాటపటిమ చూపలేకపోయారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం 2 పరుగులు చేసి ఔట్ అవ్వడం ద్వారా జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. వైభవ్ సూర్యవంశీ (26) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా, ఆరోన్ జార్జ్ (16), వేదాంత్ (9), విహాన్ (7) వంటి కీలక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. జట్టులో ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరంగా, బౌలర్ దీపేష్ (36) భారత్ తరపున అత్యధిక స్కోరర్గా నిలిచాడు.
భారీ లక్ష్యాన్ని చూసి భయపడ్డ భారత కుర్రాళ్లు కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయ్యారు. గ్రూప్ దశలో పాకిస్థాన్ను ఓడించిన భారత్, ఫైనల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. ఆయుష్ మాత్రే బౌలింగ్ నిర్ణయం తీసుకోకుండా మొదట బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.