
ఐపీఎల్-2022లో ఇప్పటివరకు కొందరు ప్లేయర్ల అద్భుత ఇన్నింగ్స్ చూశాం. జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్ ఈ సీజన్లో చెలరేగుతున్నారు. వీరిద్దరు వరుసగా ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పైగా ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండడం విశేషం. ఈ ఐపీఎల్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని యంగ్ ప్లేయర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఉమ్రాన్ మాలిక్, ఆయుష్ బదోని, తిలక్ వర్మ తదితర యంగ్ ప్లేయర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్.. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఆయుష్ బదోని ఆటతీరును కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన తన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ(54పరుగులు)తో బదోని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో అతని ప్రదర్శన ద్వారా బదోని వార్తల్లొకెక్కాడు. ఆ మ్యాచ్ లక్నో ఓడినప్పటికీ.. ఆయుష్ బదోని స్పెషల్ ఇన్నింగ్స్ మాత్రం టాక్ ఆఫ్ ది న్యూస్గా మారింది. ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ కుప్పకూలాక తీవ్ర ఒత్తిడి నెలకొన్న టైంలో బరిలోకి దిగిన బదోని ఎంతో పరిణతితో ఇన్సింగ్స్ నడిపించాడు. చూడచక్కని షాట్లతో అలరించాడు.

7ఇన్నింగ్స్లలో రెండు నాటౌట్లతో సహా 134పరుగులు చేశాడు, అతని అత్యధిక స్కోరు 54. సగటు 26.80తో స్ట్రైక్ రేట్ 139.58తో పరుగులు చేస్తున్నాడు. అతని బేస్ ధర కేవలం 20లక్షలు మాత్రమే. బేస్ ధరకే ఎల్ఎస్జీ అతన్ని కొనుక్కుంది. అతని ఆటతో జట్టుకు న్యాయం చేయడమే కాకుండా మిడిలార్డర్లో జట్టుకు సమతూకం తెస్తున్నాడు. కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది.' అని పార్థివ్ మెచ్చుకున్నాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 36పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై నిష్క్రమించింది. ఆ మ్యాచ్లో బదోని కేవలం 14పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఆ పరుగులు చాలా కీలకమైనవి. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే 62బంతుల్లో 103పరుగులు చేయడంతో లక్నో 168 పరుగులు చేయగలిగింది. ముంబై మాత్రం పేలవ బ్యాటింగ్తో ఓటమి మూటగట్టుకుంది. లక్నో తన తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఏప్రిల్ 29న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆడనుంది.