
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత్ తరఫున అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లలో అక్షర్ పటేల్ ఒకడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మరోసారి బ్యాటుతో రాణించాడు. దీంతో అతను జట్టులో చాలా కీలకంగా మారాడని, అతన్ని జట్టు నుంచి తప్పించడం కుదరదని మాజీలు అంటున్నారు. ఈ క్రమంలో తన బ్యాటింగ్ ఎలా మెరుగైందో అక్షర్ వెల్లడించాడు.
'మేం స్పిన్నర్లం. బౌలింగ్ చేసేప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయో మాకు తెలుసు. అదే టెక్నిక్ను వాడుకుంటాం. ఒక ప్రాంతంలో బంతులు వేయడానికి బౌలర్లు ట్రై చేస్తారు. మేం కాన్ఫిడెంట్గా డిఫెండ్ చేసుకుంటాం. బౌలర్లు వేరే ప్లాన్ వేసేలా ఒత్తిడి తీసుకొస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్ మైండ్ సెట్ ఉండటం కచ్చితంగా కలిసొస్తుంది' అని చెప్పుకొచ్చాడు. అక్షర్, అశ్విన్ ఇద్దరూ క్రీజులోకి వచ్చినప్పుడు భారత జట్టు చాలా కష్టాల్లో ఉంది. ఈ సమయంలో వీళ్లిద్దరూ కలిసి జట్టును ఆదుకున్నారు. దీని గురించి కూడా అక్షర్ మాట్లాడాడు.
'నిజమే.. అపపుడు మాపై ఒత్తిడి ఉంది. ఆటలో మేం వెనుకంజలో ఉన్నాం. ఆస్ట్రేలియా చేసిన టార్గెట్కు సాధ్యమైనంత దగ్గరగా వెళ్లడం మాకు చాలా ముఖ్యం. అదే మా టార్గెట్. అశ్విన్తో భాగస్వామ్యం సమయంలో పిచ్ చాలా ఈజీగా ఉందని, మేం సెట్ అయ్యామని మాట్లాడుకున్నాం. దీంతో మేం బాగా ఆడగలమని నమ్మాం. వాళ్ల స్కోరుకు ఇంత దగ్గరగా రావడం సంతోషంగా ఉంది' అని అక్షర్ చెప్పాడు. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులు చేయగా.. అక్షర్, అశ్విన్ కీలక భాగస్వామ్యంతో భారత జట్టు 262 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు మళ్లీ పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్లు ధాటిగా ఆడి రెండో రోజు చివరకు ఆ జట్టు స్కోరును 61/1కు చేర్చారు. ఉస్మాన్ ఖవాజాను జడేజా అవుట్ చేశాడు.