DC vs MI: ఐపీఎల్ 2025లోని 29వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంత మైదానంలో 12 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు గెలుస్తుందనే ఆశతో ఉంది. కానీ హ్యాట్రిక్ రనౌట్స్ ఫలితంగా ఢిల్లీ జట్టు మ్యాచ్ ఓడిపోయింది. ఈ ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చాలా నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ తర్వాత ఈ ఓటమికి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల పేలవమైన షాట్ల ఎంపికే కారణమని అక్షర్ పటేల్ అన్నాడు.
అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. "మేము మ్యాచ్ గెలిచేవాళ్లం. మేము మిడిల్ ఆర్డర్ లో కొన్ని పేలవమైన షాట్లు ఆడాము. వికెట్లను సులభంగా కోల్పోయామని భావిస్తున్నాను. అందుకే ఒక ఓవర్ మిగిలి ఉండగానే 12 పరుగుల తేడాతో ఓడిపోయాం. లోయర్ ఆర్డర్ ఆటగాడు మ్యాచ్ గెలిపించడం ప్రతిసారీ సాధ్యం కాదు. తప్పు షాట్లు ఆడినప్పుడు కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించడంలో అర్థం లేదు. 205 పరుగుల లక్ష్యం మంచిదే ఎంచుకుంటే అది మంచి పిచ్ కావడంతో పాటు మంచు కూడా ఉంది. ఫీల్డింగ్ లో మేము కొన్ని తప్పులు చేశాం. క్యాచ్లు మిస్ కాకపోతే లక్ష్యం ఇంకా తక్కువగా ఉండేది. కరుణ్ నాయర్ ఇంపాక్ట్ సబ్ గా అద్భుతంగా ఆడాడు." అని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు.

స్పిన్ బౌలర్లను అక్షర్ పటేల్ ప్రశంసిస్తూ.. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేయడం వల్ల తనకు నమ్మకం కలుగుతుందని అన్నాడు. ఆ ముగ్గురిలో ఇద్దరు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలరని చెప్పాడు. ఈ సీజన్ లో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని.. తనకు వికెట్ అవసరమైనప్పుడల్లా అతని దగ్గరకు వెళ్తానని అక్షర్ చెప్పుకొచ్చాడు. ఈ రోజు చాలా మంచి విషయాలు జరిగాయని తాను అనుకుంటున్నానని.. మనం ఈ మ్యాచ్ ను మరిచిపోవాలన్నారు.
ఢిల్లీ, ముంబై మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తిలక్ వర్మ అర్థ సెంచరీతో 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విధంగా ముంబై జట్టు 12 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.