
చెలరేగిన అక్షర్
53/3 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. మంగళవారం ఉదయం ఇంగ్లీష్ జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. స్పిన్కి అనుకూలించిన పిచ్పై ఆర్ అశ్విన్.. లారెన్స్ (26)ను బోల్తాకొట్టించడంతో వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ జో రూట్ (33; 92 బంతుల్లో 3x4) వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినా.. ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. రూట్ క్రీజులో ఉండగానే బెన్ స్టోక్స్ (8), ఓలీ పోప్ (12), బెన్ ఫోక్స్ (2) వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో రూట్ సేన భోజన విరామ సమయానికే 116/7తో ఓటమికి చేరువైంది.

అలీ మెరుపులు
ఇక రెండో సెషన్లో ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడానికి టీమిండియాకు మరి ఎక్కువ సమయం పట్టలేదు. తొలి టెస్ట్ ఆడుతున్న అక్షర్ పటేల్ వరుస ఓవర్లలో రూట్, స్టోన్ను (0) ఔట్ చేయడంతో ఇంగీష్ జట్టు ఓటమి లాంఛనమే అయింది. అయితే చివర్లో మొయిన్ అలీ (43; 18 బంతుల్లో 3x4, 5x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మూడు వరుస సిక్సులు బాదాడు. స్టువర్ట్ బ్రాడ్తో కలిసి చివరి వికెట్కు 38 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే అర్ధ శతకానికి చేరువైన అలీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఫ్రంట్ఫుట్ వచ్చి షాట్ ఆడేందుకు యత్నించగా స్టంపౌటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. మూడో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 24 నుంచి జరగనుంది.

రోహిత్, అశ్విన్ సెంచరీలు
శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 95.5 ఓవర్లలో 329 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (161: 231 బంతుల్లో 18x4, 2x6) సెంచరీ చేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్.. అశ్విన్ (5/43) దెబ్బకి 134 పరుగులకే ఆలౌట్ అయింది. 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసింది. అశ్విన్ (106: 148 బంతుల్లో 14x4, 1x6) సెంచరీ బాదాడు.

స్కోర్ బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 329 ఆలౌట్; రోహిత్ (161), స్టోన్ 3/47
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 134 ఆలౌట్; బెన్ ఫోక్స్ (42), అశ్విన్ 5/43
భారత్ రెండో ఇన్నింగ్స్: 286 ఆలౌట్; అశ్విన్ (106), అలీ 4/98
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 164 ఆలౌట్; అలీ (43), అక్షర్ 5/60


Click it and Unblock the Notifications












