హైదరాబాద్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 (శనివారం) పల్లెకెలెలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐసీసీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
దీంతో జడేజా స్ధానంలో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువ బౌలర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గుజరాత్కు చెందిన అక్షర పటేల్ భారత్ తరఫున 30వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

వన్డేల్లో 35 వికెట్లు తీసుకోగా, టీ20ల్లో 7 వికెట్లను తీశాడు. టెస్టుల్లో మాత్రం ఇంకా ఆడలేదు. సస్పెన్షన్కు గురైన జడేజా స్థానంలో అక్షర్ పటేల్ని ఎంచుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షర పటేల్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.
బీసీసీఐ గనుక అతడిని మూడో టెస్టుకి ఎంపిక చేస్తే దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలోనే వదిలేసి నేరుగా శ్రీలంకకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే గనుక జరిగితే శ్రీలంక పర్యటనలో హార్దిక్ పాండ్యా తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా అక్షర పటేల్ నిలుస్తాడు.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అక్షర్ పటేల్... రాహుల్ ద్రవిడ్ కోచింగ్ నేతృత్వంలోని భారత్-ఏ తరఫున దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అక్షర్ పటేల్ 3 మ్యాచుల్లో 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు.