
మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియాకు మరో శుభవార్త అందింది. గాయం కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్కు దూరమైన లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ జట్టుతో కలిశాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తగిన ఫిట్నెస్ సాధించిన అక్షర్ పటేల్ ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు.
దీంతో అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ టీం నుంచి విడుదలయ్యాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్కు అక్షర్ పేటేల్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్ను జట్టులోకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడిన కుల్దీప్ యాదవ్ 23.85 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఇక మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పూర్తి అధిపత్యాన్ని కనబరిచిన టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్లో అజేయంగా 175 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో 9 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన జడ్డూ, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజాకే దక్కింది. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 574-8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 174, సెకండ్ ఇన్నింగ్స్లో 178 పరుగులు మాత్రమే చేసింది.
రెండో టెస్ట్కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)