ముంబై: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లల్లో టీ20 ప్రపంచకప్ రాబోతోంది. ఆస్ట్రేలియా ఈ మెగా క్రికెట్ ఈవెంట్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆడే దేశాలన్నీ టీ20 సిరీస్లను నిర్వహిస్తోన్నాయి. శ్రీలంక-ఆస్ట్రేలియా సిరీస్ మొన్నీ మధ్యే ముగిసింది. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆదివారం ప్రారంభం కానుంది. దీని తరువాత భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20తో పాటు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ మొదలవుతుంది. అనంతరం భారత్.. వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.
రేపే టీమిండియా టీ20 మ్యాచ్: పిచ్, వెదర్ రిపోర్ట్ ఇదే: పించ్ హిట్టర్లతో
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం సెప్టెంబర్ 15వ తేదీ నాటికి జట్లు ఆటగాళ్ల పేర్లను సమర్పించాల్సి ఉంటుందంటూ ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. అన్ని దేశాల బోర్డులకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీనితో క్రికెట్ బోర్డులు జట్టు రూపకల్పన, తుది కూర్పుపై దృష్టి సారించాయి. ఆయా సిరీస్లల్లో ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ మెగా టోర్నమెంట్ కోసం ఎంపిక చేస్తాయి. ప్రతిష్ఠాత్మక టోర్నీ కావడం వల్ల దీనికి ఎవరు ఎంపిక అవుతారనే పోటీ ప్లేయర్ల మధ్య నెలకొంది.
దక్షిణాఫ్రికాతో ముగిసిన అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్కు నాయకత్వాన్ని వహించిన మిడిలార్డర్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై ఇప్పటికే అనుమానాలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి కారణం. రిషభ్ పంత్కు ప్రత్యామ్నాయంగా అదే మిడిలార్డర్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఎంపిక చేయడం మంచిదనే అభిప్రాయాలు ఇదివరకే వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు అదే తరహా అనుమానాలు ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై నెలకొన్నాయి. అతని కంటే బెటర్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ను టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేయడం మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్ బౌలింగ్, బ్యాటింగ్లో రాణించగలడని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పిచ్లపై ఆడిన అనుభవం అతనికి ఉందని పేర్కొన్నారు. జడేజాకు ఈ సారి గట్టిపోటీ తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు.
రిషభ్ పంత్ కూడా ఈ సారి కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చని సంజయ్ మంజ్రేకర్ చెప్పారు. దినేష్ కార్తీక్ నుంచి అతనికి పోటీ ఉందని గుర్తు చేశారు. బ్యాటింగ్ లైనప్లో 6, 7 స్థానాల్లో నిఖార్సయిన బ్యాటర్ను అందుబాటులో ఉంచాలని, దీనికి దినేష్ కార్తీక్ సరిపోతాడని తాను అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో ఇది నిరూపితమైందని సంజయ్ మంజ్రేకర్ తేల్చి చెప్పారు.