ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కేఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. శనివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సీఎస్కే 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. సంజూ శాంసన్ అజేయ శతకంతో.. జెమీ ఓవర్టన్(4/18) అద్భుత బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో తాము ఆశించిన రీతిలోనే శుభారంభం లభించిందని.. అయితే పవర్ప్లే ముగిసిన వెంటనే పరిస్థితి తలకిందులైందని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. తక్కువ వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోవడం వల్ల బ్యాటింగ్ మొమెంటం దెబ్బతిందని.. వికెట్లు పరుసగా పడటం వల్ల కోలుకోవడం కష్టమైందని అక్షర్ అభిప్రాయపడ్డాడు.
ఫీల్డింగ్ తప్పిదాలే ఓటమికి కారణం
ఈ మ్యాచ్లో బ్యాటర్లు తమ వంతు బాధ్యతను నెరవేర్చినప్పటికీ.. ఫీల్డింగ్ విభాగంలో జరిగిన పొరపాట్లు జట్టును దెబ్బతీశాయని అక్షర్ పటేల్ స్పష్టం చేశాడు. ఫీల్డింగే రెండు జట్ల మధ్య తేడాను చూపించిందని అన్నాడు. ముఖ్యంగా కీలక సమయాల్లో కొన్ని సులువైన క్యాచ్లను వదిలేయడం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని.. ఒకవేళ ఆ క్యాచ్లు పట్టుకుని ఉంటే సమీకరణాలు వేరుగా ఉండేవని అక్షర్ పటేల్ అసహనం వ్యక్తం చేశాడు.

బౌలర్ల కృషికి ప్రశంసలు:
ఫీల్డింగ్ పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. బౌలర్ల ప్రదర్శనను అక్షర్ కొనియాడాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై, ప్రత్యర్థి జట్టులో సెట్ అయిన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు సఫలీకృతమయ్యారని క్రెడిట్ ఇచ్చాడు. ఫీల్డర్ల నుంచి సరైన సహకారం అంది ఉంటే బౌలర్ల గణాంకాలు మరింత మెరుగ్గా ఉండేవని అక్షర్ పేర్కొన్నాడు.
పిచ్, మంచు ప్రభావం:
పిచ్ స్వభావం గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్లో పెద్దగా మార్పులేమీ రాలేదని అక్షర్ చెప్పాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రత్యర్థి బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని కొనియాడాడు. మంచు వల్ల బంతిపై పట్టు సాధించడం వారికి కష్టమైనప్పటికీ.. కచ్చితమైన ప్రణాళికతో బౌలింగ్ చేసి తమ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారని అక్షర్ పటేల్ అంగీకరించాడు.