DC vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 60వ మ్యాచ్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ సాధించిన ఈ ఒక్క విజయంతో మూడు జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఇప్పుడు ఒక ప్లేఆఫ్ స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ జరగనుంది.
అయితే టోర్నమెంట్ రెండో అర్ధభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఢిల్లీ ఈ సీజన్ను 4 మ్యాచ్ల్లో గెలిచి ప్రారంభించింది. కానీ ఆ తర్వాత 8 మ్యాచ్ల్లో వారు కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. ఢిల్లీ జట్టు ఇప్పుడు ప్లేఆఫ్కు చేరుకోవడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి గురించి కీలక ప్రకటన చేశాడు.

ఓటమి గురించి అక్షర్ పటేల్ ఏమన్నాడంటే?
సమయం గడిచేకొద్దీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారడమే ఓటమికి కారణమని అక్షర్ పటేల్ పేర్కొన్నారు. వాస్తవానికి శుభ్మన్ గిల్ , సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని వెల్లడించారు. వికెట్లు కోల్పోకపోతే లక్ష్యాన్ని ఛేదించడం చాలా సులభం అవుతుందన్నారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారిందని తాను భావిస్తున్నానన్నారు. తాము మంచి స్కోరు సాధించామని తాను అనుకుంటున్నానని అన్నారు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడన్నారు. ఢిల్లీ జట్టు మంచి స్కోరు సాధించడంలో విజయం సాధించామని భావించామన్నారు. ఢిల్లీ బౌలర్లు కూడా వికెట్లు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించారన్నారు. కానీ తాము విజయాన్ని నమోదు చేయలేకపోయామని నిరాశను వ్యక్తం చేశారు. తాము బ్యాటింగ్ చేసిన విధానం చాలా సానుకూలంగా ఉందని.. కానీ పవర్-ప్లేలో మా ఫీల్డింగ్, బౌలింగ్ను మెరుగుపరచుకోవాలని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్లో పిచ్ మెరుగ్గా మారిందన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో బంతి ఆగి వచ్చిందని.. కానీ రెండో ఇన్నింగ్స్ లో అలా జరగలేదన్నాడు. అందుకే ఢిల్లీ బ్యాటర్లు సాధించిన లక్ష్యాన్ని ఛేదించడం వారికి సులభతరం అయిందని అక్షర్ పటేల్ స్పష్టం చేశాడు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ(112*) సాయంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ జట్టుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. సాయి సుదర్శన్ 61 బంతుల్లో అజేయంగా 108 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.