
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత లోయర్ ఆర్డర్ ఆకట్టుకుంటోంది. తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్.. రెండో టెస్టులో కూడా జట్టును ఆదుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను ఢిల్లీలో కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా అవుటైపోయారు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు విరాట్ కోహ్లీ, జడేజా ప్రయత్నించారు.
జడ్డూ అవుటైన కాసేపటికే కోహ్లీ కూడా పెవిలియన్ చేరడంతో భారత జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. అనంతరం కేఎస్ భరత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అప్పటికి భారత జట్టు స్కోరు 139 మాత్రమే. అలాంటి సమయంలో రవిచంద్రన్ అశ్విన్ (37), అక్షర్ పటేల్ (74) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ వందపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత జట్టు ఆధిక్యం సాధించకపోయినా.. దాదాపుగా ఆసీస్ స్కోరును సమం చేసింది. చివరకు 262 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ ఇన్నింగ్స్ చూసిన నిపుణులు, ఫ్యాన్స్ అందరూ కూడా అక్షర్ పటేల్ను తెగ మెచ్చుకుంటున్నారు. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో కూడా అక్షర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఢిల్లీలో కూడా అతనే మరో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇది చూసిన నిపుణులు.. జట్టుకు అక్షర్ అతి పెద్ద ఆస్తిగా మారాడని మెచ్చుకుంటున్నారు. అభిమానులు కూడా జట్టు కష్టాల్లో ఉంటే 'నేనున్నా' అంటూ అక్షర్ ముందుకు వస్తున్నాడని పొగుడుతున్నారు. అశ్విన్, అక్షర్ ఇద్దరి భాగస్వామ్యమే టీమిండియాను నిలబెట్టిందని అందరూ అంటున్నారు. ఈ క్రమంలోనే రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 61/1 స్కోరుతో నిలిచింది. మూడో రోజు మొత్తం ఆస్ట్రేలియానే బ్యాటింగ్ చేసినా.. చివరి రెండ్రోజుల్లో భారత జట్టు పట్టుదలగా ఆడితే విజయం సాధించే అవకాశం ఉంది.