
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో రవీంద్ర జడేజా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో అద్భుతమైన బంతులతో ఆసీస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసుకొని ఆసీస్ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దాదాపు ఖాయం చేసుకుంది.
తొలి టెస్టులో కూడా జడ్డూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి మ్యాచ్లో ఏమాత్రం పోటీ ఇవ్వని ఆసీస్.. రెండో మ్యాచులో కొంత పోటీ ఇచ్చేలాగే కనిపించింది. కానీ జడ్డూ మాయలో పడి ఘోరంగా ఓడింది. గాయం కారణంగా సుమారు ఐదు నెలలో జట్టుకు దూరమైన జడేజా.. వరుసగా రెండు మ్యాచుల్లోనూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ రెండు మ్యాచుల్లో కూడా అక్షర్ పటేల్ పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలో జడ్డూతో అక్షర్ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.
తనకు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడం గురించి అక్షర్ జోకులు పేల్చాడు. దీని గురించి నేరుగా జడేజాను ప్రశ్నించాడు. 'సర్, నాకు బౌలింగ్ చేసే ఛాన్స్ రావడం లేదు. అక్షర్కు బౌలింగ్ ఇవ్వకూడదని ఇలా బౌలింగ్ చేస్తున్నారా?' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విన్న జడేజా పగలబడి నవ్వేశాడు. ఈ రెండు టెస్టుల్లో బంతితో రాణించే అవకాశం అక్షర్కు రాలేదు.
కానీ బ్యాటుతో అతను ఆకట్టుకున్నాడు. రెండు మ్యాచుల్లో కలిపి 158 పరుగలు చేశాడు. రెండు మ్యాచుల్లోనూ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఈ సిరీసులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. తొలి టెస్టులో రోహిత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.