బలమైన బౌలింగ్ లైనప్..
సిరీస్ మొత్తానికీ టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటారు. ఇదివరకు దక్షిణాఫ్రికా, ఆ తరువాత ఇంగ్లాండ్, ఇప్పుడు వెస్టిండీస్లో బౌలర్లు దుమ్మురేపుతున్నారు. బౌలింగ్ వనరులు అత్యంత బలంగా ఉన్న మేటి జట్టుగా నిలిచింది టీమిండియా. సీనియర్లు, జూనియర్లతో బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంటోంది. భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, రవి చంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా ఎలాంటి జట్టునయినా ఢీ కొట్టేలా కనిపిస్తోంది.
అర్ష్దీప్, అవేష్ ఖాన్..
కొత్తగా జట్టులో చోటు దక్కించుకున్న అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.. తమ సత్తా చాటుతున్నారు. వెస్టిండీస్ పర్యటనలో ఈ ముగ్గురూ అంచనాలకు మించి రాణిస్తోన్నారు. ప్రత్యేకించి ఫాస్ట్ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్.. వరుసగా వికెట్లు పడగొడుతున్నారు. వీరిద్దరూ టీ20 స్పెషలిస్ట్ బౌలర్లుగా ఎదుగుతున్నారు. వెస్టిండీస్తో ముగిసిన నాలుగో టీ20ల్లో వీరిద్దరూ చెలరేగారు. నాలుగు ఓవర్లల్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు అవేష్ ఖాన్. 3.1 ఓవర్లల్లో 12 పరుగులకే మూడు వికెట్లు తీశాడు అర్ష్దీప్.
ఐపీఎల్ నుంచి
అవేష్ ఖాన్-అర్ష్దీప్ సింగ్ ఇద్దరూ ఐపీఎల్ ఫ్యాక్టరీ అందించిన ప్రొడక్ట్సే. ఐపీఎల్ 2022లో నిలకడగా రాణించారు. తాము ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నట్లు జట్లు విజయం సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అవేష్ ఖాన్, పంజాబ్ సూపర్ కింగ్స్కు అర్ష్దీప్ సింగ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ మెగా టోర్నమెంట్లో సత్తా చాటి మరీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు.
ఉమ్రాన్ మాలిక్కు తెర
ఈ పరిణామాలు సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్కు ఇబ్బందికరంగా పరిణమించినట్టే. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడానికి అతను చేస్తోన్న ప్రయత్నాలకు అడ్డు పడినట్టే. ఇదివరకు అతను టీమిండియాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతనితో పాటు అడుగు పెట్టిన అర్ష్దీప్ సింగ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకునేలా కనిపిస్తోన్నాడు. అయిదు టీ20ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్ పునరాగమనం చేశాడు. 12 టీ20ల్లో 11 వికెట్లు తీసుకున్నాడు.