
భారత్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఉవ్విళ్లూరుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ను 2-0తో నెగ్గిన ఆసీస్.. అదే జోరులో భారత్కు రానున్నారు. అంతకుముందు వెస్టిండీస్ టెస్టు సిరీసును కూడా ఆసీస్ జట్టే నెగ్గింది. అయితే భారత్లో మంచి టర్న్ ఉండే పిచ్లను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ను విలేకరులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అతను.. తామేమీ గుడ్డిగా భారత్కు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు.
ఈసారి భారత్లో టెస్టు సిరీస్ గెలిచే అవకాశం తమకు ఎక్కువగా ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. 'ఈసారి మాకు మంచి ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే కొత్త మార్పులకు చక్కగా అలవాటు పడుతున్నాం. గతేడాది పాకిస్తాన్, శ్రీలంకతో ఆడిన అనుభవంతో భారత్లో ఆడేందుకు రెడీ అవుతున్నాం. అక్కడకు మేం గుడ్డిగా వెళ్లడం లేదు. ఇప్పుడు దొరికే ఖాళీ సమయంలో ఈ ఏడాది భవిష్యత్తుపై ఒక అంచనాకు రావడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఫ్రెష్గా భారత్లో అడుగు పెడతాం' అని వివరించాడు.
ప్రస్తుతం ఆసీస్ జట్టులో నాథన్ లియాన్ ఒక్కడే ప్రభావం చూపుతున్న స్పిన్నర్గా ఉన్నాడు. అతనికి సహకారం అందించే మరో స్పిన్నర్ లేడు. దీంతో ఆ జట్టు రెండో స్పిన్నర్ కోసం వేట సాగిస్తోంది. ముఖ్యంగా భారత్లో స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లపై లియాన్తోపాటు మరో మంచి స్పిన్నర్ ఉంటే టీమిండియాకు సమస్యలు సృష్టించవచ్చని భావిస్తోంది. అదే సమయంలో భారత్ వద్ద అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి ప్రమాదకరమైన స్పిన్నర్లను ఎదుర్కోవడం కూడా ఆసీస్ ముందు పెద్ద సవాల్గా మారనుంది. ఈ విషయంలో వెటరన్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ మీదనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడనుంది. వీరికితోడు ప్రస్తుతం ఫామ్లో ఉన్న ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ కూడా కీలకం కానున్నారు.