సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు భారీగా దెబ్బతిన్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియషిప్ (2023-25) పాయింట్ల పట్టికలో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. కివీస్తో సిరీస్ ప్రారంభానికి ముందు 70+ విజయ శాతంతో ఉన్న టీమిండియా ప్రస్తుతం 58.33 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా ఫైనల్ సినారియో క్లిష్టంగా మారింది.
భారత్ తమ మిగిలిన మ్యాచ్ల్లో కచ్చితంగా నాలుగింట్లో విజయం సాధించాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ముచ్చటగా మూడోసారి టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరుతుంది. కాగా, టీమిండియా చివరి అయిదు మ్యాచ్లు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. సాధారణంగానే రసవత్తరంగా సాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి డబ్యూటీసీ ఫైనల్ సినారియోతో మరిం హీటెక్కనుంది.

మరోవైపు ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. విరాట్ కోహ్లిని కొనియాడుతూనే, రన్ మెషిన్తో ప్రమాదం లేదని ఆసీస్ బ్యాటర్ లబుషేన్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లిలో తీవ్రత తగ్గిందని, అతను మునపటి కోహ్లి కాదని అన్నాడు. ''ఆట పరంగా విరాట్ కోహ్లితో నా జ్ఞాపకం 2018 సిరీస్. అప్పుడు అతను టీమిండియా కెప్టెన్. కోహ్లి చాలా తీవ్రతతో ఉండేవాడు. ఆ సిరీస్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఆ తర్వాత అలాంటి కోహ్లిని మళ్లీ చూడలేదు. కోహ్లితో నా మొదటి జ్ఞాపకం గురించి చెబుతున్నాను. అయితే అతను ఎంతో కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. నాణ్యమైన ఆటగాడు'' అని లబుషేన్ పేర్కొన్నాడు.
కోహ్లి గత 10 ఇన్నింగ్స్ల్లో 21.33 సగటుతో 192 పరుగులే చేశాడు. కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. అయిదు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. కాగా, 2018/19తో పాటు 2020/21 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజేతగా నిలిచింది. ఇక 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే విజయం సాధిస్తోంది. కాగా, ఈ సారి అయిదు మ్యాచ్లతో నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్
డిసెంబర్ 06-10: రెండో టెస్టు- అడిలైడ్
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ.