జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించట్లేదని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు. 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిష్, వన్డే వరల్డ్ కప్లో ఆసీస్ జట్టును కమిన్స్ గొప్పగా నడిపించిన సంగతి తెలిసిందే. రెండు ఫైనల్లో భారత్పై గెలిచి ట్రోఫీలు అందించాడు. కానీ టీ20 ఫార్మాట్లో కమిన్స్కు నాయకత్వ బాధ్యతలను ఆస్ట్రేలియా బోర్డు ఇవ్వాలనుకోవట్లేదు.
టీ20 వరల్డ్ కప్లో ఆల్రౌండర్ మిచెల్ మార్ష్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ తెలిపాడు. ''టీ20 జట్టును మార్ష్ నడిపించిన తీరుపై సంతోషంగా ఉన్నాం. ప్రపంచకప్లో అతనే నాయకుడిగా భావిస్తున్నాం''అని మెక్డొనాల్డ్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు కోచ్గానే కాకుండా సెలక్టర్గానూ మెక్డొనాల్డ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొన్నాళ్లుగా టీ20 జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్సీ నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్లో జట్టును మార్ష్ నడిపించాడు. స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ జట్టులో ఉన్నప్పటికీ మిచెల్ మార్ష్నే సారథిగా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టెస్టు ఫార్మాట్లో కమిన్స్ గొప్ప ప్లేయర్ అయినప్పటికీ టీ20 ఫార్మాట్లో అతడు చేసిన అద్భుత ప్రదర్శనలు చాలా తక్కువ.అంతేకాకుండా పొట్టి ఫార్మాట్ తుదిజట్టులో కమిన్స్ ఉంటాడనే గ్యారెంటీ కూడా లేదు.
ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని టీ20 వరల్డ్ కప్లో మార్ష్కు బాధ్యతలు అందివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2022 టీ20 ప్రపంచకప్ ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా జట్టును నడిపించాడు. ఫించ్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం మార్ష్ అనధికారిక కెప్టెన్గా కొన్ని మ్యాచ్ల్లో కొనసాగాడు. పొట్టి ఫార్మాట్లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా సారథి బాధ్యతలు నిర్వర్తించాడు.
మరోవైపు వన్డే వరల్డ్ కప్, టెస్టుల్లో నాయకత్వ నైపుణ్యాలను మెచ్చి సన్రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కమిన్స్కే అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు కమిన్స్ ట్రోఫీనీ అందిస్తే ఆస్ట్రేలియా బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలూ ఉన్నాయి.