హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై సోమవారం ఓ దుండగుడు రాళ్లతో దాడికి దిగాడు. ఆటగాళ్లు మైదానం నుంచి హోటల్కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
సోమవారం బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య చిట్టగాంగ్ వేదికగా రెండోటెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్కి బయలుదేరారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఆసీస్ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు విసిరాడు. దీంతో బస్సు కిటికీ అద్దం పగిలిపోగా ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు.
దీంతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ సెక్యూరిటీ అధికారులు భద్రతను పెంచారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఆసీస్ సెక్యూరిటీ మేనేజర్ సీన్ కరోల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడామని, వారు భద్రతను కట్టుదిట్టం చేశారని ఆయన తెలిపారు.
రెండో రోజు ఆట కోసం మంగళవారం ఉదయం భారీ భద్రత నడుమ ఆసీస్ ఆటగాళ్లు మైదానానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 2006లో తొలిసారి బంగ్లాదేశ్లో పర్యటించగా మళ్లీ ఇప్పుడే ఆ జట్టు పర్యటిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరిస్ కోసం ఆస్ట్రేలియా 2015లో పర్యటించాల్సిఉండగా భద్రతా కారణాల వల్లే స్మిత్ సేన పర్యటనను రద్దు చేసుకుంది. రెండు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై బంగ్లా చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఇక, చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ (5/77) ఐదు వికెట్లతో అదరగొట్టాడు.
117 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ రహీమ్(62 నాటౌట్), షబ్బీర్ రెహమాన్(66) హాఫ్ సెంచరీలతో బంగ్లాదేశ్ను ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లియాన్ ఐదు వికెట్లలో టాపార్డర్లో నలుగురు బ్యాట్స్మెన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం విశేషం.