హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియాల మధ్య నెలకొన్న వేతనాల వివాదం తారాస్ధాయికి చేరింది. ఆటగాళ్ల కాంట్రాక్ట్ ముగిసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా.. బోర్డు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆగస్టులో జరిగే బంగ్లాదేశ్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు క్రికెటర్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్తో రహస్యంగా సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బంగ్లా పర్యనటలో భాగంగా ఆగస్టు 22 నుంచి బంగ్లాదేశ్తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి రెండు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా తలపడనుంది. ప్రస్తుత జీతాల ఒప్పందం ప్రకారం బోర్డుకి వచ్చిన ఆదాయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) క్రికెట్ ఆదాయంలో 25 శాతాన్ని క్రికెటర్లకు పంచుతోంది. కానీ.. కొత్త కాంట్రాక్ట్లో కేవలం మిగులును మాత్రమే అందజేయాలని బోర్డు నిర్ణయించడంతో ఆటగాళ్లు కొత్త కాంట్రాక్ట్పై సంతకం చేసేందుకు ససేమేరా అంటున్నారు.
పాత కాంట్రాక్ట్ గడువు జూన్ 30న ముగియగా.. కొత్త దానిపై సంతకం చేయకపోవడంతో ప్రస్తుతం ప్రధాన జట్టుతో పాటు దాదాపు 300 మందికి పైగా దేశంలోని క్రికెటర్లు నిరుద్యోగులుగా మిగిలారు. ఈ సమస్యని పరిష్కరించాలని రెండు నెలలుగా మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రయత్నిస్తున్నా చర్చలు సఫలం కావట్లేదు.