హైదరాబాద్: ఆటగాళ్ల జీతాలు ఆస్ట్రేలియా క్రికెట్లో ముసలం పుట్టించాయి. జీతాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య వివాదం ముదిరింది. దీంతో అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనుకాడబోమని ఆస్ట్రేలియా క్రికెటర్లు హెచ్చరించారు.
అంతేకాదు జీతాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా దిగి రాకపోతే యాషెస్ సిరీస్ దూరంగా ఉండాలని స్టార్క్లాంటి సీనియర్ ఆటగాళ్లు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమ్మెకు షేన్ వాట్సన్, మిచెల్ జాన్సన్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా మద్దతిస్తున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా ప్రతిపాదించిన జీతాల విధానాన్ని క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళా క్రికెటర్లతోపాటు అందరికీ భారీగా జీతాలు పెంచుతామని గత నెలలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ప్రకటించారు. 20 ఏళ్లుగా పాటిస్తున్న విధానాన్ని కాకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు.
గత 20 ఏళ్లుగా లాభాల్లో కొంత మొత్తాన్ని క్రికెటర్లకు ఇచ్చే విధానాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కొనసాగిస్తోంది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆ విధానాన్ని మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాటు జూన్ 30లోపు కొత్త కాంట్రాక్ట్పై సంతకాలు చేయకపోతే.. ఆ తర్వాత జీతాలు కూడా ఇవ్వబోమని సీఏ బెదిరింపులకు దిగుతోంది.
దీంతో ఆసీస్ క్రికెటర్లు సమ్మె దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు కూడా దూరంగా ఉంటామని పలువురు క్రికెటర్లు అంటున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా తీరు ఎలా ఉందో ఈ బెదిరింపులు చూస్తేనే అర్థమవుతున్నదని ఏసీఏ చీఫ్ అలిస్టర్ నికోల్సన్ అన్నాడు. చర్చల పేరుతో పిలిచినా.. సీఏ దూకుడుగా వ్యవహరిస్తూ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందని ఆయన అన్నాడు.