టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ లో లేడన్న సంగతి తెలిసిందే. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ నిరాశపరిచాడు. అయితే సాధారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే ప్రతీసారి రెచ్చిపోయి ఆడుతుంటాడు కోహ్లీ. కానీ ఈ సారి మాత్రం విఫలమైపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ టీజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏమని టీజ్ చేశాడంటే?
తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఓ యాడ్ ను షూట్ చేశారు. అందులో కమిన్స్ షేవింగ్ చేసుకుంటూ అద్దంలో తనని తాను చూసుకుంటూ కనిపించాడు. ఇదే సమయంలో పలువురు స్టార్ ప్లేయర్లనూ టీజ్ చేశాడు. బెన్ స్టోక్స్, క్వింటన్ డికాక్, పోప్, కోహ్లీపై సరదాగా సైటర్లు వేశాడు. 'హాయ్ కోహ్లీ.. నువ్వు ఇలా నెమ్మదిగా ఆడటం ఇప్పటి వరకు చూడలేదు. చాలా నెమ్మదిగా ఆడావు'.. 'పోప్, నువ్వు ప్రార్థన మొదలు పెట్టుకో' అంటూ కామెడీ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

కమిన్స్ వర్సెస్ కోహ్లీ
గతంలో అహ్మాదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిర్వహించిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో స్లోవర్ షార్టెస్ట్ డెలివరీతో ఔట్ చేశాడు. ఈ పోరులో 63 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 54 పరుగులు మాత్రమే చేశాడు. అలానే ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు వేసిన కమిన్స్.. 34 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి డౌటే
పలు వ్యక్తిగత కారణాలతో లంక పర్యటనకు దూరమైన ప్యాట్ కమిన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతడు చీలమండ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఆసీస్ కోచ్ మెక్డొనాల్డ్ తెలిపాడు. ఒకవేళ కమిన్స్ ఈ ట్రోఫీ ఆడకపోతే స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్లో ఒకరు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశముంది.