
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో మరో కొత్తకోణం వెలుగు చూసింది. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో స్టీవ్ స్మిత్పై ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు కూడా ఆదేశించింది. ఈ విచారణలో స్టీవ్ స్మిత్ మోసానికి పాల్పడ్డాడని తేలితే జీవితకాల నిషేధం విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసీస్కు చెందిన అభిమానులు సైతం వీళ్లపై జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి స్మిత్ను తొలగించింది. అతడి స్థానంలో కొత్త కెప్టెన్గా రహానేకు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న స్టీవ్ స్మిత్పై జట్టులోని సహచర ఆటగాడు, మోజెస్ హెన్రిక్స్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
'నా అభిప్రాయం ప్రకారం సీనియర్ ఆటగాళ్లెవరూ ఈ విధమైన మోసంలో భాగస్వాములుగా ఉండరు. బెన్క్రాఫ్ట్ను రక్షించడం కోసమే స్మిత్ జట్టు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నామని కట్టుకథ అల్లాడు. బాల్ టాంపరింగ్ జరుగుతున్న విషయం మిగతా ఆటగాళ్లకు తెలియకపోవచ్చు. కెప్టెన్గా స్మిత్ యువ ఆటగాళ్లను రక్షించే ప్రయత్నంలో ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ' ట్వీట్ చేశాడు.
కాగా, మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఆటగాడు బాన్క్రాఫ్ట్ ఓ టేపుతో బాల్ టాంపరింగ్కు పాల్పడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, సీనియర్ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
ట్యాంపరింగ్కు పాల్పడినట్లు వీడియోలో కనిపించడంతో బాన్క్రాప్ట్ ఈ తప్పిదానికి తాను పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని అన్నాడు. మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్తో తప్పు చేయించిన స్టీవ్స్మిత్పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించింది.
ఇక, టాంపరింగ్కు పాల్పడిన బాన్క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో చేర్చింది. అంతేకాదు బాల్ టాంపరింగ్కు ప్రోత్సహించిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో నాలుగో రోజు ఆటలో టిమ్ పెయినీ కెప్టెన్గా వ్యవహరించాడు.