సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాపార్డర్ పూర్తిగా విఫలమయినా దీప్తి శర్మ (49; 46 బంతుల్లో 3 ఫోర్లు) ఆదుకోవడంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి.. ఆసీస్ ముందు 133 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ (29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) ఓ మోస్తారుగా మెరుపులు మెరిపించింది. ఆసీస్ బౌలర్లలో జెస్ జోనాసెన్ రెండు వికెట్లతో రాణించింది.
క్రికెట్కు గుడ్ బై చెప్పిన ప్రజ్ఞాన్ ఓజా!!
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ ఇన్నింగ్స్ను ఆరంభించింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్వుమెన్ షఫాలీ వర్మ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసింది. ఇన్నింగ్స్ నాలుగవ ఓవర్లో ఆమె నాలుగు ఫోర్లు కొట్టింది. మరోవైపు స్మృతి మంధాన (10; 11 బంతుల్లో 2x4) వేగంగా ఆడలేకపోయింది. జట్టు స్కోరు 41 పరుగుల వద్ద తొలుత మంధాన జొనాసెన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగింది.
ఆ తర్వాతి ఓవర్లోనే షెఫాలీ వర్మ 43 పరుగుల వద్ద పెర్రీ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి సుథర్లాండ్ చేతికి చిక్కింది. కాసేపటికే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (2) కూడా స్టంపౌటైంది. దీంతో భారత్ 8 ఓవర్లకు 51/3తో నిలిచింది. ఈ సమయంలో దీప్తీ శర్మ, జెమిమా రోడ్రిగ్స్ (26; 33 బంతుల్లో) ఆచితూచి ఆడారు. నాలుగో వికెట్కు ఈ జోడి 53 పరుగులు జోడించారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రోడ్రిగ్స్.. కిమ్మిన్స్ బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగింది.
రోడ్రిగ్స్ ఔట్ అయినా.. దీప్తీ క్రీజులో నిలబడి పరుగులు చేసింది. వేదా కృష్ణమూర్తి (9) అండతో దీప్తి శర్మ స్టైక్ రొటేట్ చేస్తూ కుదురుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేయగల్గింది. దీప్తి చివరి వారు క్రీజులో ఉండి హాఫ్ సెంచరీ ముందు ఆగిపోయింది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ రెండు వికెట్లు సాధించగా.. పెర్నీ, కెమ్మిన్సెలు తలో వికెట్ తీశారు.