
మహిళల టీ20 వరల్డ్ కప్లో కీలకమైన సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఆసీస్ సారధి మెగ్ లానింగ్ మరో ఆలోచన లేకుండా ముందు బ్యాటింగ్ చేస్తామని చెప్పింది. ఈ నిర్ణయం సరైందేనని ఆ జట్టు నిరూపించింది. ఆసీస్ ఓపెనర్లు అలీసా హేలీ (25), బెత్ మూనీ (54) అదరగొట్టారు. వీళ్లిద్దరూ రెచ్చిపోవడంతో ఆరంభం నుంచే ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగింది.
వీళ్లు అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచింది. ఆమెకు ఆష్లీ గార్డనర్ (31) ధనాధన్ ఇన్నింగ్స్ కూడా తోడవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. గ్రేస్ హారిస్ (7), ఎలీస్ పెర్రీ (2 నాటౌట్) పరుగులు చేశారు. కాగా, కెప్టెన్ లానింగ్, గార్డరన్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా జట్టు చివరి పది ఓవర్లలో 103 పరుగులు చేసింది. వీటిలో చివరి ఐదు ఓవరల్లోనే 61 పరుగులు వచ్చాయి. మరీ దారుణంగా చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు 30 పరుగులు సమర్పించుకున్నారు.

భారత బౌలర్లలో ఒక్కరు కూడా ఆసీస్ ఎదురు దాడికి అడ్డుకట్ట వేయలేకపోయారు. టీమిండియా స్టార్ బౌలర్ రేణుకా సింగ్ బౌలింగ్ను ఆసీస్ బ్యాటర్లు బాగా టార్గెట్ చేశారు. ఆమె వేసిన నాలుగు ఓవర్లలో 41 పరుగులు పిండుకున్నారు.

టీ20 వరల్డ్ కప్లో భారత్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న ఆమె బౌలింగ్లోనే ఇలా బాదేయడంతో.. మిగతా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. రేణుక వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు తీసుకోగా.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.