ఐసీసీ వన్డే మహిళల వరల్డ్ కప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల కీలక మ్యాచ్ జరుగుతోంది. ఆసక్తికరమైన మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తోంది. ఈ కీలక మ్యాచ్ల ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy) టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
టాస్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ . తమ నిర్ణయాన్ని వివరిస్తూ, "మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. నిన్న సాయంత్రం శిక్షణ సమయంలో పిచ్పై తేమ ఎక్కువగా కనిపించింది. అందుకే బంతి బ్యాట్పై బాగా వస్తుందని ఆశిస్తున్నాం. జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. సోఫీ మోలినెక్స్ తిరిగి వచ్చింది, కాగా వారెహామ్ స్థానం కోల్పోయింది. కీలక మ్యాచ్ల్లో విజయం సాధించడం ముఖ్యం. కానీ భారత్ లాంటి బలమైన జట్టును ఎదుర్కొనేటప్పుడు మేము అన్ని విభాగాల్లో సమష్టిగా ఆడాలి. 2011 తర్వాత విశాఖపట్నంలో ఆడటం నాకు ఇదే మొదటిసారి. ఇక్కడ అద్భుతమైన వాతావరణంతో పాటు ఆస్ట్రేలియాకు మద్దతు కూడా ఉంది. మా అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు" అని అన్నారు.

భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందన
టాస్ ఓడిపోయినప్పటికీ భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తమ జట్టుపై విశ్వాసం వ్యక్తం చేసింది. "ఈ పిచ్ గత మ్యాచ్లోని పిచ్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. అందుకే మేము అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాము. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేది ముఖ్యం. గత మ్యాచ్లో మేము 95 ఓవర్ల పాటు పోటీలో ఉన్నాం. అది మాకు చాలా సానుకూల అంశం. అభిమానుల మద్దతు మాకు ఎప్పుడూ ముఖ్యం, ఇది మా జీవితంలో లభించిన గొప్ప అవకాశం" అని హర్మన్ప్రీత్ అన్నారు.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI:
అలిస్సా హీలీ (కెప్టెన్ & వికెట్ కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డనర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్ , అలానా కింగ్, మేగాన్ షుట్
ఇండియా ప్లేయింగ్ XI:
ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి