
కోహ్లీ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "అనుకున్నదానికంటే 15-20 పరుగులు ఎక్కువే ఇచ్చినా లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. అయినా ఆఖర్లో మ్యాచ్ను వారు దూరం చేశారు. ఆసీస్ ఆటగాళ్లు మాకన్నా ఎక్కువ కసితో ఆడారు. అందుకు ఈ విజయానికి వారు అర్హులే. గత మూడు మ్యాచ్ల్లో ఒత్తిడిలో వారు పట్టుదలగా నిలబడ్డారు. ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు" అని అన్నాడు.

ఇలాంటి ఓటములు మంచిదే
"ప్రపంచ కప్కు ముందు తప్పులు సరిదిద్దుకునేందుకు ఇలాంటి ఓటములు మంచిదే. మా లోపాలను సరి చేసుకుంటాం. సిరీస్ కోల్పోయినా మా ఆటతీరుపై సంతృప్తిగానే ఉన్నా. చివరి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాం. అయితే ఓటమికి మార్పులు కారణం కాదు. వరల్డ్ కప్కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసం మాలో ఉంది" అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఎలాంటి సమస్యలు లేవు
"జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు. మహా అయితే ఒక స్థానం(నాలుగు) గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలపడుతుంది. అలాగే బౌలింగ్ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది" అని కోహ్లీ తెలిపాడు.

ఏ జట్టు హాట్ ఫేవరేట్ కాదు
"ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్కప్ బరిలో దిగే ఏ జట్టు హాట్ ఫేవరేట్ కాదు. మాతో పాటు వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సమతూకంగా ఉంది. పాక్ను తక్కువ అంచనా వేయలేం" అని కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది.
35 పరుగుల తేడాతో భారత్ ఓటమి
దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్ను ఆస్ట్రేలియా 3-2తేడాతో కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది.


Click it and Unblock the Notifications












