హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎమ్సీజీ)లో జరగనున్న రెండో టెస్టుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే మెల్బోర్న్లో ఉగ్రవాద సంబంధింత అరెస్టులు జరిగిన నేపథ్యంలో డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు.

కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ ఏడుగురు యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశామని ఛీఫ్ పోలీస్ కమిషనర్ గ్రాహం ఆస్టన్ తెలిపారు. క్రిస్టమస్ రోజున ఫెడరేషన్ స్క్వేర్, సెయింట్ పాల్స్ కథేడ్రల్కు అతి సమీపంలోని మెల్ బోర్న్ ఫ్లైండర్స్ స్ట్రీట్ ట్రైన్ స్టేషన్పై దాడి చేయడానికి ఆ యువకులు ప్రణాళిక రచించినట్లు ఆయన స్పష్టం చేశారు.
'ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటంతో బాక్సింగ్ డే టెస్టుకు భద్రతను పెంచేందుకు సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు మిగతా క్రికెట్ మ్యాచ్లు జరిగే ప్రదేశాల్లో కూడా భద్రత పెంచే యోచనలో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మ్యాచ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి' అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సండర్లాండ్ తెలిపారు.
ప్రేక్షకులు ఫెన్సింగ్ను దాటుకుని స్టేడియంలోకి వస్తున్నారనే కారణంతో 2015లో భద్రతా కారణాల దృష్ట్యా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చుట్టుకొలతను 20 నుంచి 25 మీటర్లకు పెంచారు. ఇక, బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్పై ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో గెలిచింది.