పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 360 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. డేవిడ్ వార్నర్ (164), మిచెల్ మార్ష్ (90) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 487 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఆమిర్ జమల్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. అయితే పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 271 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (62), షఫీకి (42) మినహా ఎవరూ రాణించలేదు. నాథన్ లయాన్ మూడు వికెట్లు, కమిన్స్ రెండు వికెట్లు తీశారు.
216 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 233/ 5 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఖవాజా (90), మిచెల్ మార్ష్ (63*) రాణించారు. అనంతరం 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 89 పరుగులకే కుప్పకూలింది. సౌద్ షకిల్ (24) టాప్ స్కోరర్. స్టార్క్, హేజిల్వుడ్ మూడు వికెట్లు, లయాన్ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో లయాన్ 500 వికెట్ల మార్క్ను అందుకున్నాడు.

అయితే ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ చివరిసారిగా 1995లో టెస్టు మ్యాచ్ లో గెలిచింది. ఇప్పటివరకు టెస్టు సిరీస్ ను విజయం సాధించలేకపోయింది. 1999 నుంచి వరుసగా 14 టెస్టుల్లో పాక్ ఓటమిపాలైంది. కనీసం 'డ్రా' కూడా మ్యాచ్ ను ముగించలేకపోయింది. ఇప్పుడు మరోసారి చిత్తుగా ఓడటంతో పాక్ టీమ్పై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
పాకిస్థాన్ చివరిసారిగా ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ గెలిచినప్పుడు సచిన్ కేవలం 12 సెంచరీలే చేశాడని, ముత్తయ్య మురళిధరన్ 111 వికెట్లే పడగొట్టాడని, రికీ పాంటింగ్ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేయలేదని, ఇక ఆసీస్ ఒకే వరల్డ్ కప్ గెలిచిందని.. పాక్ను ట్రోల్ చేస్తున్నారు. తరాలు మారుతున్నా ఆసీస్ గడ్డపై పాక్ విజయం సాధించలేకపోతుందని కామెంట్లు చేస్తున్నారు.