పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 360 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 487 పరుగులు చేయగా, పాకిస్థాన్ 271 రన్స్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 233/5 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 89 పరుగులకే కుప్పకూలింది.
అయితే ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ చివరిసారిగా 1995లో టెస్టు మ్యాచ్ లో గెలిచింది. ఇప్పటివరకు టెస్టు సిరీస్ ను ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. 1999 నుంచి వరుసగా 15 టెస్టుల్లో పాక్ ఓటమిపాలైంది. 24 ఏళ్ల నుంచి కనీసం 'డ్రా'గా కూడా మ్యాచ్ ను ముగించలేకపోయింది.

అయితే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించే సత్తా భారత్కు మాత్రమే ఉందని ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ అన్నాడు. ''ఆస్ట్రేలియా అదరగొట్టింది. వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఎంతో బలంగా ఉన్నారు. 500 టెస్టు వికెట్లు సాధించిన నాథన్ లయాన్కు కంగ్రాట్స్, అద్భుతంగా ఆ ఘనత అందుకున్నాడు. అయితే స్ట్రాంగ్ ఉన్న ఆస్ట్రేలియాను ఓడించే సత్తా టీమిండియాకు మాత్రమే ఉంది'' అని వాన్ ట్వీట్ చేశాడు.
తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఆడిన గత 35 చివరి టెస్టుల్లో నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. ఆ నాలుగు టెస్టుల్లో టీమిండియానే ఘన విజయం సాధించింది. ఏ ఇతర జట్టు ఆసీస్ను ఓడించలేకోయింది. ఇక అయిదు టెస్టులు ఆసీస్ 'డ్రా'గా ముగించగా అందులో భారత్తో ఆడిన రెండు మ్యాచ్లు ఉన్నాయి. మిగిలిన మూడు టెస్టుల్లో రెండు ఇంగ్లాండ్తో, ఒకటి దక్షిణాఫ్రికాతో ఆసీస్ ఆడింది.
మరోవైపు గత 24 ఏళ్ల నుంచి వరుసగా ఓడుతున్న పాకిస్థాన్ జట్టుపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. చివరిసారిగా ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ గెలిచినప్పుడు సచిన్ కేవలం 12 సెంచరీలే చేశాడని, ముత్తయ్య మురళిధరన్ 111 వికెట్లే పడగొట్టాడని, రికీ పాంటింగ్ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేయలేదని, ఇక ఆసీస్ ఒకే వరల్డ్ కప్ గెలిచిందని.. పాక్ను ట్రోల్ చేస్తున్నారు. తరాలు మారుతున్నా ఆసీస్ గడ్డపై పాక్ విజయం సాధించలేకపోతుందని కామెంట్లు చేస్తున్నారు.