వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్న ఆసీస్ తర్వాత వరుస విజయాలతో సత్తాచాటింది. ఫైనల్లో బలమైన టీమిండియాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే కప్ అందుకున్న అనంతరం అహంకారంతో ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్ చేసిన అతి చేష్టలు 140 కోట్ల భారతీయులకు కోపం తెప్పించింది.
సోఫాలో కూర్చొని మిచెల్ మార్ష్ బీర్ తాగుతూ.. కాళ్లను వరల్డ్ కప్పై పెట్టి ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. ఈ ఫొటోలను ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్తో పాటు ఐసీసీ షేర్ చేయడం గమనార్హం. అయితే కప్ కోసం కలలు కనే భారతీయులకు ఇది తీవ్ర కోపం తెప్పించింది. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కప్ను ముద్దాడాలనే లక్ష్యంతో పోరాడుతుంటాడు. అలాంటి కప్ను అవమానించడంతో మార్ష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

అయితే ఇప్పుడు మార్ష్ను టీమిండియా అభిమానులు ప్రశంసిస్తున్నారు. దానికి కారణం మార్ష్ అందరి మనసులు గెలుచుకునేలా ఓ పని చేశాడు. పెర్త్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 90, 63* పరుగులతో రాణించిన మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
అయితే అవార్డు సందర్భంగా తాను అందుకున్న మెడల్ను మార్ష్ ఓ స్కూల్ పిల్లాడికి అందజేశాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆ పిల్లాడు ఆసీస్ ప్లేయర్ల ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నిస్తుంటే.. మార్ష్ తన బహుమతి అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. మంచి పని చేశావంటూ మార్ష్ను కొనియాడుతూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, మూడు టెస్టుల సిరీస్లో భాగంగా డిసెంబర్ 26 నుంచి పాకిస్థాన్తో ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడనుంది. మెల్ బోర్న్ వేదికగా జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ ఇటీవల తమ జట్టును ప్రకటించింది.