మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ బాక్సింగ్ డే టెస్టు నిలిచిపోవడానికి వరుసగా అనూహ్య కారణాలు ఎదురవుతున్నాయి. తొలి రోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత పావురాల వల్ల మ్యాచ్ను కాసేపు ఆపారు. ఇవాళ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడని కొన్ని నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు.
194/6 స్కోరుతో ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ 264 పరుగులకు ఆలౌటైంది. ఆమిర్ జమాల్ (33), షాహీన్ అఫ్రిది (21)తో కలిసి రిజ్వాన్ (42) కీలక పరుగులు సాధించాడు. కమిన్స్ అయిదు వికెట్లతో చెలరేగాడు. నాథన్ లయాన్ నాలుగు వికెట్లు, హేజిల్వుడ్ ఒక్క వికెట్ పడగొట్టారు.

అనంతరం 54 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. షాహిన్ అఫ్రిది ధాటికి మూడు ఓవర్లలోపే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే ఖవాజా (0)ను, లంచ్ విరామానికి ముందు ఆఖరి బంతికి లబుషేన్ (4)ను అఫ్రిది ఔట్ చేశాడు. అయితే లంచ్ ముగించుకొని ఆటగాళ్లు, ఫీల్డ్ అంపైర్లు మైదానానికి వచ్చారు.
కానీ, అంపైర్లు ఆటను ప్రారంభించలేదు. దానికి కారణం.. లిఫ్ట్లో థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇరుక్కుపోయాడు. ఇది తెలిసిన తర్వాత డేవిడ్ వార్నర్ నవ్వును ఆపుకోలేకపోయాడు. మరోవైపు బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫోర్త్ అంపైర్.. థర్డ్ అంపైర్ రూమ్లోకి పరిగెత్తుకొని వెళ్లాడు. మొత్తంగా థర్డ్ అంపైర్ తిరిగి తన బాధ్యతలు అందుకోవడంతో ఆట మొదలైంది. ఆ తర్వాత నుంచి కెమెరామెన్ థర్డ్ అంపైర్పై ఫోకస్ చేయడం విశేషం. తిరిగొచ్చానంటూ థర్డ్ అంపైర్ కూడా ప్రేక్షకులకు సింబాలిక్గా చెప్పాడు.