
సిడ్నీ: కరోనా వైరస్ (కొవిడ్-19)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు మ్యాచ్లు, టోర్నీలు వాయిదా లేదా రద్దు అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సిరీస్ కూడా చేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్తో పాటు మూడు టీ20ల సిరీస్ను న్యూజిలాండ్ అర్థంతరంగా రద్దు చేసుకుంది. అయితే వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దేశంలో కరోనా వైరస్ను అరికట్టడానికి ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్కు వచ్చే వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆదివారం అర్థరాత్రి తర్వాత నుంచి వచ్చిన వారిని ఏయిర్ పోర్ట్లోనే నిర్బంధంలోకి తీసుకొని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆసీస్ పర్యటనలో ఉన్న కివీస్ జట్టు మేనేజ్మెంట్ అప్రమత్తం అయింది. న్యూజిలాండ్లో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు అమలుకాకముందే తమ దేశానికి వెళ్లిపోవాలని కివీస్ జట్టు అనుకుంది. దీంతో ఆదివారం జరగాల్సిన రెండో వన్డేతో పాటు మిగిలిన టీ20 సిరీస్ను కూడా వాయిదా వేసుకొని బయలుదేరనుంది.
తొలి వన్డే మ్యాచ్ అనంతరం కివీస్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ తీవ్ర గొంతు నొప్పికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన కివీస్ జట్టు వెంటనే అతడిని ప్రత్యేక వార్డుకు చేర్చింది. ఇదే విషయమై న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... 'మ్యాచ్ అనంతరం ఫెర్గూసన్ గొంతు నొప్పి ఉందని చెప్పడంతో.. వెంటనే అప్రమత్తమయ్యాం. జట్టు బస చేసిన హోటల్లో అతన్ని ప్రత్యేకంగా ఉంచాం. 24 గంటల పాటు అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు. కరోనా వైరస్ సోకిందా లేదా అన్నది అతని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది' అని అన్నాడు.
ఇక ఇంగ్లండ్-శ్రీలంక టెస్టు సిరీస్ను కూడా వాయిదా చేశారు. షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఇంగ్లండ్ జట్టు మార్చి 19న, మార్చి 27న రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. కానీ.. కరోనా విజృంభిస్తుండటంతో శ్రీలంక సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్-ఇంగ్లండ్ మ్యాచ్ను మధ్యలోనే డ్రాగా ముగించారు. మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్కు కూడా కరోనా ఎఫెక్ట్ తగిలింది. పాక్ లీగ్లో ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు, వెస్టిండీస్ ప్లేయర్ బ్రాత్వైట్ స్వదేశానికి తిరిగి వెళ్లాళని నిర్ణయించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో భారత్లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగతా రెండు వన్డేలను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది.